మోర్తాడ్, నవంబర్ 4: అబద్ధాల కాంగ్రెస్ను నమ్మి ఓట్లేస్తే.. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ కాళరాత్రులే మిగులుతాయని బీఆర్ఎస్ బాల్కొండ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని సుంకెట్, దోన్పాల్, గాండ్లపేట్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి వారికి ఓటేస్తే.. కరెంటు ఎప్పుడు వస్తుందో.. పోతుందో వేచిచూడాల్సిన పరిస్థితులు ఉంటాయని, అర్ధరాత్రుల్లో కాళ్లు కాలువలో పెట్టి పడుకోవాల్సిన రోజులు తిరిగి వస్తాయని హెచ్చరించారు.
మొన్ననే కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి 5 గంటల కరెంటు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతంలో సాగుకు 5హెచ్పీ మోటరుకు కనెక్షన్ కావాలంటే ప్రభుత్వానికి రూ.2 లక్షలు కట్టాలి, కనెక్షన్ తీసుకోవడానికి ఖర్చులు, ఇక ఏటా సాగునీరు కోసం రూ.10,500 చెల్లించాలి. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేయని పనులు తెలంగాణలో ఏవిధంగా చేస్తారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ 50 ఏండ్లు, టీడీపీ పొత్తుతో 20 ఏండ్లు పాలించిన బీజేపీలు ఇంటింటికీ నల్లాలు, ఆడబిడ్డల పెండ్లిలకు కల్యాణలక్ష్మి, బీడీ కార్మికులకు పింఛన్, రైతులకు సాగునీరు, రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇక్కడ అభివృద్ధి జరిగిందని, ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని ఉద్ఘాటించారు.