హైదరాబాద్: బాలాపూర్ గణేశుని లడ్డూ వేలం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. గణేశ్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూ వేలం పాటకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. గణేశుడిని భజనబృందం పాటలు, డప్పు చప్పుళ్ల సందడి నడుమ బాలాపూర్ ప్రధాన వీధుల్లో ఊరేగిస్తున్నారు. అనంతరం బాలాపూర్ ముఖ్య కూడలిలో లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు.
1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం పాట కొనసాగుతున్నది. గత 27 ఏండ్లుగా ఉత్సవ సమితి లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతేడాది లడ్డూ వేలం జరగలేదు. మొదటిసారిగా లడ్డూ వేలం రూ.450తో ప్రారంభమైంది. 2010 నాటికి రూ.10.32 లక్షలకు చేరింది. 2019లో కొలన్ రాం రెడ్డి రూ.17.6 లక్షలకు లడ్డూని దక్కించుకున్నారు. 2018లో శ్రీనివాస్ గుప్తా రూ.16.6 లక్షలకు గణేశుని లడ్డూ సొంతం చేసుకున్నారు. కాగా, భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలాపూర్ గణేశుడికి చోటు దక్కింది.