ఖైరతాబాద్, ఏప్రిల్ 13: కల్లు పేరుతో మంత్రి శ్రీనివాస్గౌడ్పై అసత్య ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకురాలు డీకే అరుణ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగోని బాలరాజ్గౌడ్ డిమాండ్ చేశారు. మంత్రిపై కక్షసాధింపుతో చేసే దుష్ప్రచారాలను మానుకోకుంటే గౌడ సంఘాలతో కలిసి ఆమె ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆమె కుటుంబసభ్యులే కల్లు కాంపౌండ్లు నడిపారని, కల్తీ కల్లు సృష్టించి వేల కోట్లు దండుకున్నారని, నిజమైన గౌడలకు చెడ్డపేరు తెచ్చారని విమర్శించారు. కల్తీ కల్లు ఘటనలో మంత్రి శ్రీనివాస్గౌడ్ రాజీనామా చేయాలంటూ ఆమె వ్యాఖ్యానించడం చూస్తే దొంగే దొంగ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కల్తీ కల్లు ఎవరు విక్రయించినా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంత్రి స్పష్టంగా చెప్పారని, డీకే అరుణ మాత్రం తన రాజకీయ పబ్బం కోసమే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే కల్తీ కల్లు ఘటనపై అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.