సూర్యాపేట : బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రతీక అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బక్రీద్ పరవదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిఢవిల్లుతున్న మత సామరస్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దీక్షా, దక్షతలే కారణమన్నారు. పండుగలు, జాతరలు ఏవైనా అందరి భాగస్వామ్యం ఉందంటే అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమన్నారు.
భిన్న సంస్కృతులకు తెలంగాణ పెట్టింది పేరన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. రాజకీయ అవసరాల కోసం మతాల మధ్య చిచ్చు రగిల్చి పబ్బం గడుపుకునేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. వర్గ, వైశామ్యాలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలనుకునే వారితో అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.