హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితుడైన బైరి నరేశ్కు చర్లపల్లి జైల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై, నిందితుడిని ఇతర సెల్లోకి మార్చే అవకాశాలపై నివేదిక అందజేయాలని న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. నిందితుడు నిజంగా ఒంటరిగా ఒక సెల్లో ఉన్నాడో లేదో కూడా నివేదిక ద్వారా తెలుపాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. చర్లపల్లి జైలు గదిలో ఏకాంతంగా నిర్బంధించడం చట్ట వ్యతిరేకమంటూ బైరి నరేశ్, అతని భార్య సుజాత దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఇతర ఖైదీలతో నరేశ్ను ఉంచితే అతని ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదమున్నదని, ఆయన శ్రేయస్సు కోసమే విడిగా ఒక సెల్లో ఉంచా ల్సి వచ్చిందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. చర్లపల్లి జైలు అధికారులు ఎలాంటి మానవ హకుల ఉల్లంఘనకు పాల్పడలేదని ప్రభుత్వ న్యాయవాది సామల రవీందర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు.
ఇతర నిందితులకు ఇస్తున్న ఫోన్ కాల్స్, మెడికల్, క్యాంటీన్ లాంటి సౌకర్యాలన్నీ నరేశ్కు కల్పిస్తున్నట్టు వివరించారు. జైల్లో స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతి కూడా ఉన్నదని చెప్పారు. రోజూ జైలు అధికారులు అతని ఆరోగ్యం గురించి చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. సున్నితమైన అంశాలపై నిందితుడు బైరి నరేశ్ చేసిన వ్యాఖ్యల కారణంగా అతనికి ఇతర ఖైదీల నుంచి ప్రాణహాని ఉన్నదని నిఘా నివేదికలు అందాయని తెలిపారు. ఇతరులను కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదని, ఆరు ములాఖత్లకు అనుమతి ఇచ్చారని వెల్లడించారు. విచారణలో ఉన్న ఇతర ఖైదీలను కలిసేందుకు నరేశ్ను అనుమతించడం లేదని పిటిషనర్ల న్యాయవాది చెప్పారు. దీనిపై విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది.