ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 19 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్( Khammam market)లో మిర్చి బస్తాలు పోటెత్తాయి(Chillies poured). ఆదివారం సెలవు దినం కావడం.. సోమవారం మార్కెట్లో క్రయవిక్రయాలు ప్రారంభం కావడంతో జిల్లా రైతులతోపాటు పొరుగు జిల్లాలు, ఏపీ రాష్ట్రం నుంచి దాదాపు లక్ష బస్తాలను విక్రయానికి తరలించడంతో యార్డు పూర్తిగా నిండిపోయింది. తెల్లవారే సరికి త్రీటౌన్ ప్రాంతంలో ఎక్కడ చూసినా మిర్చి బస్తాల వాహనాలు దర్శనమిచ్చాయి.
జాతీయ మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో స్థానిక వ్యాపారులు పోటీపడి పంట కొనుగోలు చేశారు. జెండా పాటలో మిర్చి పంట గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.20,850 పలికింది. మధ్య రకం క్వింటాల్ రూ.19 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలు పలికింది. తాలు రకం పంటకు క్వింటాల్ రూ.12 వేల గరిష్ఠ ధరతో వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. సాయంత్రం వరకు వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసినప్పటికీ మిర్చి కాంటాలు, తోలకాల ప్రక్రియ పూర్తి కాలేదు.