Aleru | యాదాద్రి భువనగిరి : యాదవులను ఆర్థికంగా ఎదిగేలా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కే యాదవులంతా ఓటు వేయాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గం పరిధిలోని గుండాలలో నిర్వహించిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో లింగయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు. కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మొదటి పూజ చేసే భాగ్యం యాదవులకు దక్కిందన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉండడం మనకు ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. 7 లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేసిన ఒకే ఒక్కడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. గొంగిడి సునీత కుటుంబం నాయకులుగా చెలామణి కాలేదు.. మీకు సేవకులుగా ఉన్నారని తెలిపారు.
దేవాదుల, బస్వాపూర్ కాలువ నీళ్ళతో మీ కాళ్ళు కడిగే బాధ్యత సునీతది అని లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లను రూ. 5 వేలకు పెంచబోతున్నాం. రూ. 200 ఉన్న పెన్షన్ను రూ. 2 వేలకు పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. రైతుబంధు కూడా ఎకరాకు రూ. 16 వేలు చేసుకోబోతున్నాం. సౌభాగ్య లక్ష్మీ పథకం కింద 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 3 వేల చొప్పున అందిస్తామన్నారు. ఇక 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలా..? 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావాల్నా..? అనేది మీరే నిర్ణయించాలన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ దొంగ బ్రదర్స్.. బీజేపీ పార్టీలోకి తమ్ముడిని పంపి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఆలేరులో సునీత గెలవబోతుందని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు.