Andhrajyothy | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై విషం కక్కడాన్ని అలవాటుగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక.. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలపైనా తన అక్కసు వెళ్లగక్కింది. రాష్ట్రమంతా పదేండ్ల పండుగను సంబురంగా జరుపుకోవడాన్ని చూసి ఆంధ్రజ్యోతికి కండ్లు మండాయి. తొమ్మిదేండ్లకే దశాబ్ది ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారంటూ అడ్డగోలుగా కథనాలు వండి వార్చింది. వాస్తవానికి జూన్ 2వ తేదీతో రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తయ్యి, పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో దీర్ఘకాల ప్రణాళికతో ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ మాత్రం కూడా ఆంధ్రజ్యోతి అర్థం చేసుకోలేకపోయింది. దేశానికి స్వాంతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవాలు’ నిర్వహిస్తున్నది.
వాస్తవానికి నిరుడు ఆగస్టు 15కు 75 ఏండ్లు పూర్తయ్యాయి. కానీ 75 వారాల (సంవత్సరంన్నర) ముందుగానే.. అంటే 2021 మార్చి 12 నుంచే ప్రధాని మోదీ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15 వరకు కొనసాగుతాయని కేంద్రం చెప్పింది. అంటే రెండున్నరేండ్లపాటు అమృత్ మహోత్సవాలు కొనసాగుతాయి. కానీ ఆంధ్రజ్యోతి ఏనా డూ 75 ఏండ్లు పూర్తికాకుండానే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన పాపాన పోలేదు. అంతేకాదు.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల విషయంలోనూ ఇదే జరిగింది.
ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా నిరుడు మే 28 నుంచి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ప్రారంభిస్తున్నట్టు టీడీపీ ప్రకటించిం ది. ఆ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఈ నిర్ణయాన్ని తాటికాయం త అక్షరాలతో పొగిడింది. అక్కడితో ఆగకుండా రెండు పేజీల నిండా ప్రత్యేక కథనాలు వండి వార్చింది. కానీ.. తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం అడ్డగోలు రాతలతో, కథనాలతో విషం కక్కుతున్నది. తొమ్మిదేండ్లు పూర్తయ్యి.. పదేండ్లు మొదలవుతున్న సందర్భంగా అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తుంటే కడుపుమంటతో అడ్డగోలుగా రాస్తున్నది.