విద్యాభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత
మంత్రి గంగుల కమలాకర్
మేదరి ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన
పాల్గొన్న మంత్రులు తలసాని, శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్, ఫిబ్రవరి 20 : దశాబ్దాలుగా అన్ని రంగాల్లో అణచివేతకు గురైన బీసీలు సీఎం కేసీఆర్ పాలనలోనే ప్రగతిపథంలో పయనిస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బీసీల విద్యాభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని తెలిపారు. ఆదివారం ఆయన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్తో కలిసి ఉప్పల్ భగాయత్లో మేర, మేదరి సంఘాల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. బీసీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా అమలు చేయని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కొనియాడారు. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 16 గురుకులాలు మాత్రమే ఉండేవని, గత ఏడేండ్లలో సీఎం కేసీఆర్ వాటిని 281కు పెంచారని వివరించారు. బీసీలు ఆత్మగౌరవంతో బతకాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ నడిబొడ్డున 41 బీసీ కులాలకు వేల కోట్ల విలువైన 83 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతోపాటు ఒక్కో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.కోటి చొప్పున నిధులు కూడా అందజేశారని గుర్తుచేశారు. మేర, మేదర సంఘాలు వెంటనే ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని ప్రారంభించుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఏకతాటిపైకి వచ్చిన 15 కుల సంఘాలకు అనుమతి పత్రాలు అందజేశామని తెలిపారు. మిగిలిన సంఘాలు కూడా మార్చి 31లోగా ఏక సంఘంగా ఏర్పడి భవన నిర్మాణాలను ప్రారంభించుకోవాలని సూచించారు. సమావేశంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.