హైదరాబాద్, ఆగస్టు ౩ (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి రం గం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్ల ప్ర క్రియ పూర్తి కావడంతో ఈ నెల రెండో వారం నుంచి పంపిణీ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సీజన్లో సుమారు 100 కోట్ల చేప, రొయ్య పిల్లల పంపిణీకి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 90 కోట్ల చేపపిల్లలు, 10 కోట్ల రొయ్యపిల్లలు పంపిణీ చేయనున్నారు. దీనికి ప్రభుత్వం ఏకంగా రూ.90 కోట్లు వెచ్చించనున్నది. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 23,114 చెరువుల్లో చేపపిల్లలను విడుదల చేయగా.. ఈ ఏడాది 26,700 చెరువుల్లో విడుదలకు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా మత్స్యశాఖ అన్ని చెరువులను జియో ట్యాగింగ్ చేసింది. దీంతో చేపల పెంపకానికి అనువైన చెరువులను సులువుగా గుర్తించి దశల వారీగా పిల్లలను విడుదల చేయనున్నారు.
సరైన సమయంలో విడుదల
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, వాగులన్నీ పొంగిపొర్లుతున్నాయి. దీంతో సరైన సమయంలో చేప పిల్లల విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల రెండో వారం నుంచి పంపిణీ చేయాలని తొలుత అనుకొన్నారు. కానీ, ఇప్పటికే నీటితో నిండిన చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లను విడుదల చేశాక మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ఆ పిల్లలన్నీ కొట్టుకుపోతాయి. దీంతో స్థానిక మత్స్యకారులకు నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వర్షాలను బట్టి చేపల పంపిణీ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
పెరుగుతున్న చేపల సంఖ్య
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 2016లో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. అనుకున్నట్టుగానే ఈ పథకం మత్స్యకారులకు ఆర్థిక భరోసాను కల్పించింది. ఈ నేపథ్యంలో వారికి మరింత ఆసరా అందించేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా ఉచితంగా పంపిణీచేసే చేపపిల్లల సంఖ్యను క్రమంగా పెంచుతున్నది. 2016-17లో 27.85 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేసిన ప్రభుత్వం.. గత ఏడాది రూ.72 కోట్ల ఖర్చుతో 75 కోట్ల చేపపిల్లలను, రూ.16 కోట్ల ఖర్చుతో 7 కోట్ల రొయ్య పిల్లలను పంపిణీ చేసింది. దీంతో రూ.6 వేల కోట్ల విలువైన 3.89 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి.