హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో కొనసాగుతున్న చర్యలు, లాక్ డౌన్ వల్ల కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని, ఇదే విధానాన్ని కొనసాగిస్తూ కోవిడ్ పరీక్షలు పెంచి, కరోనాను పూర్తిగా కట్టడి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువు ముగింపునకు వస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కొనుగోలు చేపట్టాలన్నారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ కమిషనర్ తో నేడు మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణం నుంచి టెలికాన్ఫరెన్సు నిర్వహించి కోవిడ్, ధాన్యం కొనుగోలు పరిస్థితులను సమీక్షించారు.
కోవిడ్ లక్షణాలున్న వారిని వెంటనే గుర్తించి వారికి ఇంటివద్దే కోవిడ్ కిట్ లు ఇవ్వడానికి, కరోనాను గ్రామ స్థాయిలోనే కట్టడి చేసేందుకు ఫీవర్ రెండో దశ సర్వే పటిష్టంగా చేపట్టాలని సూచించారు. ఈ ఫీవర్ సర్వేలో కోవిడ్ బారిన పడ్డవారికి సీరియస్ ఉంటే వెంటనే హాస్పిటల్ లో చేర్చేవిధంగా సమన్వయం చేయాలని, స్వల్ప లక్షణాలున్న వారిని ఇంటివద్దే క్వారంటైన్ చేసి వారికి తగిన చికిత్స ఇస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.
కోవిడ్ బారిన పడి ప్రజలు ప్రాణాలు పోగోట్టుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ మార్గదర్శనం చేస్తున్నారని, కాబట్టి కోవిడ్ వల్ల ప్రాణనష్టం జరగకుండా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వ్యాక్సినేషన్ మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో రెండోసారి వ్యాక్సిన్ తీసుకునే వారికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాల వద్ద ప్రజలు గుమి కూడకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు.
రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ వారాంతంలోనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో జిల్లాల్లో ధాన్యం కొనుగోలుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గోనె సంచుల కొరత, రవాణా ఇబ్బందులను తొలగించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ తో మాట్లాడారు. గోనె సంచులు లేక, రవాణా సమస్యలుంటే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని, అందుకోసం వెంటనే ఈ జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోరారు.