నిజామాబాద్ : సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు(Babli Project )గేట్ల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(SRSP)కు నీటిని విడుదల చేసింది. విడుదల చేసిన 0.6 టీఎంసీల నీరు బుధవారం రాత్రి వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో 80 కిలోమీటర్ల దూరంలోని ధర్మాబాద్ సమీపంలో మహారాష్ట్ర సర్కారు బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. దీంతో ఎస్సారెస్పీలోకి వచ్చే వరదకు అడ్డుకట్ట పడింది.
రాష్ట్రం ఈ విషయంలో సుప్రీంకోర్టు(Supreme court)ను ఆశ్రయించడంతో ప్రతి సంవత్సరం మార్చి 1న దిగువకు 0.6 టీఎంసీల నీటిని తాగునీటి కోసం, జూలై 1నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు వానకాలం సీజన్ మొత్తం బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంచాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పు మేరకు బుధవారం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈ ఎన్.శ్రీనివాస్రావు, నాందెడ్ ఈఈ ఎఎస్.చౌగ్లె, నాందెడ్ డీఈఈ ఆర్ఆర్ పోటెదార్, ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి, ఏఈఈ వంశీ పాల్గొన్నారు. బాబ్లీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 2.75 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.07 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో నుంచి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసి తిరిగి గేట్లను మూసివేయనున్నారు.