హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ)/కోస్గి/వర్గల్: రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం, అరాచకం పెరిగిపోతున్నది. ఓటమి భయంతో బీఆర్ఎస్ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు. కొడంగల్లో శనివారం రాత్రి బీఆర్ఎస్ నేత, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారు. డ్రైవర్, గన్మెన్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బాబా ఫసియుద్దీన్ హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్లను కాంగ్రెస్ నాయకులు కోస్గి నుంచి వెంబడించి దాడికి పాల్పడారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, అతడి 40 మంది అనుచరులు బొంరాస్పేట్ మండలం తుంకిమెట్ల గేటు సమీపంలో రోడ్డుకు అడ్డంగా రాళ్లను పెట్టి కర్రలతో దాడికి తెగబడ్డారు. రెండు కార్లను ధ్వంసం చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయలయ్యాయి. బాబా ఫసియుద్దీన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో పరిగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ దాడి నుంచి అల్లా, ప్రజల ఆశీర్వాదం వల్ల తాను బతికానని బాబా ఫసియుద్దీన్ చెప్పారు. తన వెంట వచ్చిన విద్యార్థులు, యువతపై కూడా దాడులు చేశారని తెలిపారు. రేవంత్రెడ్డి ఓటమి భయంతో హత్య, హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఇచ్చే ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందన సరిగా లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు ఇచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లకు నోటీసులు ఇస్తున్న అధికారులు.. ప్రతిపక్షాలకు ఎలాంటి నోటీసులు ఇవ్వడం లేదని, వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ఫిర్యాదులపై సరిగ్గా స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. మంత్రి కేటీఆర్కు ఇచ్చిన నోటీసుపై ఫిర్యాదు కాపీ కోసం చూస్తున్నామని, ఆ తర్వాత వివరణ ఇస్తామని తెలిపారు.
బాబా ఫసియుద్దీన్పై రేవంత్రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేశారని బాధితుడితో కలిసి సోమ భరత్కుమార్ ఆదివారం బీఆర్కేఆర్ భవన్లో సీఈవో వికాస్రాజ్కు ఫిర్యాదు చేశారు. కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని, అయినా వారిపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. శనివారం రాత్రి నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని ఫామ్హౌజ్లో ఉన్న బీఆర్ఎస్ నేత జీఎస్ స్టేట్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డిని కాంగ్రెస్లో చేరాలని తిరుపతిరెడ్డి తన అనుచరులతో వచ్చి కత్తితో బెదిరించాడని ఫిర్యాదు చేశారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మక్త్యాలలో ఆదివారం బీఆర్ఎస్ ప్రచారరథం బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. మీనాజిపేటలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డి రోడ్షో ముగించుకొని మక్త్యాలకు వస్తుండగా ప్రచార రథం పోస్టర్లను చింపివేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్ ఎందుకు చించారని ప్రశ్నించగా, బీజేపీ కార్యకర్తలు గొడవకు దిగారు. బీజేపీ చర్యను బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.