కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రస్తుతం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు లోపభూయిష్టంగా ఉన్నదని, నిశితంగా పరిశీలిస్తే.. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పం, చిత్తశుద్ధి అందులో కన్పించడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ విమర్శించారు. మహిళా బిల్లు అంశం పై బుధవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు క్లాస్-5 ప్రకారం చూస్తే.. జనాభా లెక్కలు జరిగిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ జరుగుతుందని, దాని తదుపరి మాత్రమే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని కేంద్రం చెప్తుందని అన్నారు.
నిజానికి 2020 -21లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా వల్ల వాయిదా పడ్డాయని అయితే.. ఈ జనాభా లెక్కల గురించి ఇప్పటివరకు కేంద్రం ప్రయత్నించడం లేదని విమర్శించారు. ఆ లెక్కన చూస్తే వచ్చే జనాభా లెక్కలు 2030-31లో జరుగుతాయని, అలాగే, 2030- 31లో జరిగే జనాభా లెక్కల చివరి ఫైనల్ పబ్లికేషన్ అయ్యే నాటికి మరో మూడు, నాలుగేండ్లు పడుతుందని అన్నారు. అప్పుడు ఆ లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంటుందని తెలిపారు.
వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే.. 2039లో మహిళా బిల్లు అమలుకు నోచుకునే అవకాశం ఉన్నట్టు అర్థమవుతుందని అన్నారు. డీలిమిటేషన్కు సంబంధించి 2002లో రాజ్యాంగ సవరణ జరిగిందని, లోక్సభకు సంబంధించి ఆర్టికల్ 82, అసెంబ్లీలకు సం బంధించి 170 ఆర్టికల్ను అప్పు డు సవరించిన విషయాన్ని ఆయ న గుర్తుచేశారు. ప్రధాని వాజ్పేయి హయాంలో న్యాయ శాఖ మంత్రిగా అరుణ్జైట్లీ ఉన్నప్పుడు ఈ సవరణ జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సవరణలో 2026 వరకు డీలిమిటేషన్ ఉండదని, అలాగే 2026 తదుపరి జరిగే జనాభా లెక్కల ఆధారంగా తదుపరి డీలిమిటేషన్ జరుగుతుందని స్పష్టం గా సవరణలో పేర్కొన్నట్టు తెలిపారు. ఆ లెక్కన చూస్తే.. జనాభా లెక్కలు 2030-31 లో జరుగుతాయని చెప్పారు. 2002లో జరిగిన రాజ్యాంగ సవరణ ప్రకారం చూస్తే.. 2030లో జరిగే జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ ఉంటుందని ప్రస్తుత రాజ్యాం గం స్పష్టం చేస్తున్నదని అన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లును చిత్తశుద్ధితో ప్రవేశ పెట్టినట్టు కన్పించడం లేదని ఆరోపించారు. పూర్తి అవగాహన లేమితో బిల్లును ప్రవేశపెట్టడమే కాకుండా.. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న సంకల్పంతో పెట్టిన బిల్లులా కనిపించడం లేదని విమర్శించారు.
ప్రస్తుతం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును సవరించడానికి మరో బిల్లును ప్రవేశపెట్టి తీరాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం రాజ్యాంగం 2026లో డీలిమిటేషన్ ఉన్నదని స్పష్టంగా చెపుతుందని, ఈ విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. స్పష్టత లేకుండా, అవగాహన లేకుండా బిల్లు పాస్ చేయడం వల్ల భవిష్యత్తులోనూ అనేక అవాంతరాలు తలెత్తి.. మహిళా లోకానికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.