హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు తీరును చూస్తే వచ్చే ఎన్నికల్లో మహిళా బిల్లు రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టంచేశారు. మోదీ ప్రభుత్వానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ధి లేదని, వచ్చే పదేండ్ల వరకు మహిళా బిల్లు అమలులోకి వచ్చే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో ప్రతిపాదిస్తున్న మహిళా బిల్లును తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎ న్నికల్లో మహిళా బిల్లు అమలులోకి వచ్చే విధంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2002లో చేసిన 82వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, 2031లో జనా భా గణన ఉంటుందని, వివిధ రకాల ప్రాసెస్ పూర్తి అయిన తర్వాతనే మహిళా బిల్లు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలు ఉండటం లేదని స్పష్టమైందని తెలిపారు.
మహిళా బిల్లుపై మహిళలకు ఆశలు కల్పిం చి ఆచరణలో మాత్రం మోదీ ప్ర భుత్వం మొండి చెయ్యి చూపిందని మండిపడ్డారు. 2031 త ర్వాత పార్లమెంటులో మళ్లీ చట్టం చేస్తేనే మహి ళా బిల్లు సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన మహిళా బిల్లు ఆచరణలోకి రావాలంటే రాజ్యాంగానికి సవరణలు (ఆర్టికల్ 230-ఏఏ, 230ఏ, 232ఏ, 334) జరగాల్సి ఉంటుందని, దీనికి అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు అనివార్యమని ఆయన పేర్కొన్నారు.