ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్
కరీమాబాద్, మార్చి 20: రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి ఇంటికీ రెండు బర్రెలు పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం వరంగల్ అర్బన్ జిల్లా మామునూరులోని పశు వైద్య కళాశాలలో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గోపాలమిత్రలకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలో పశు సంపద మరింత పెరగాల్సి ఉన్నదని, అందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో పాల దిగుబడి పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. హైదరాబాద్కు రోజూ 26 లక్షల లీటర్ల పాలు అవసరమన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 6 లక్షలు మాత్రమే దిగుమతి అవుతుండగా మిగతా పాలు చిత్తూరు, గుజరాత్, బెంగళూరు నుంచి వస్తున్నట్టు చెప్పారు. కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్ నుంచి పాలు ఎందుకు పంపకూడదో ఇక్కడి రైతులు ఆలోచించాలన్నారు. వరంగల్లోనూ డెయిరీ ఏర్పాటుకు కృషి చేస్తానని వినోద్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.