హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): శబరిమలకు రైల్వే శాఖ ప్రారంభించిన ప్రత్యేక రైళ్లతో ఎటువంటి ప్రయోజనం లేదని అయ్యప్ప భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రైళ్లలో టికెట్ ధర ఎక్కువ కాగా, ప్రయాణ సమయం కూడా ఎక్కువేనని వాపోతున్నారు. ప్రతి ఏడాది తెలుగు రాష్ర్టాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. కానీ ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైల్వే శాఖ సదుపాయాలు కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా శబరిమలకు 40 ప్రత్యేక రైళ్లను ప్రారంభించినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లలో సాధారణ చార్జీలకన్నా 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. పైగా సాధారణ రైలు 25 గంటల్లో శబరిమలకు చేరుకుంటుండగా, ఈ ప్రత్యేక రైళ్లకు మాత్రం 35 గంటలు పడుతున్నదని శబరిమల వెళ్లి వచ్చిన భక్తులు తెలిపారు. భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైళ్ల చార్జీలను తగ్గించాలని, ప్రయాణ సమయాన్ని కూడా కుదించాలని వారు కోరుతున్నారు.