హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కంటి సమస్యలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, చూపును నిర్లక్ష్యం చేస్తే కంటికే ప్రమాదమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో శనివారం ఆయన ‘శాంతిలాల్ సాంఘ్వి కార్నియా ఇన్స్టిట్యూట్’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కండ్లు ఆత్మకు కిటికీ లాంటి అని అంటారు.. కానీ కండ్లు ప్రపంచానికి గేట్వే లాంటివి కూడా అని చెప్పారు. కాంతులను, రంగులను అనుభూతి చెందడానికి ఉపయోగపడే అవయవాలు కండ్లు అని, మనకున్న అనుభవాలన్నీ మన కంటి దృష్టిపైనే ఆధారపడి ఉంటాయని అన్నారు.
ఇం తటి కీలకపాత్ర పోషించే కండ్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ ఐకాన్లుగా చార్మినార్, హుస్సే న్సాగర్, హైటెక్ సిటీల సరసన ఇప్పుడు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కూడా నిలిచిందని కొనియాడారు. గత 35 ఏండ్లుగా ఈ సంస్థ అనేక మైలురాళ్లను అధిగమించిందని ప్రశంసించారు. ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పటివరకు దాదాపు మూడున్నర కోట్ల మంది ప్రయోజనం పొందారని వివరించారు. కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ జీఎన్ రావు, ప్రొఫెసర్ పార్థ ప్రతిమ్ మజుందార్, కార్నియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు.