జనగామ, జూన్ 24 (నమస్తే తెలంగాణ): జనగామ జిల్లా పాలకుర్తి మండలం పోతనామాత్యుడి స్వగ్రామం బమ్మెరలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆదివారం రైతు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సదస్సుకు హైకోర్టు జడ్జి జస్టిస్ పీ నవీన్రావు, నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ శ్రీకృష్ణదేవరావు, లీఫ్ అధ్యక్షుడు భూమి సునీల్కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. వీరంతా గ్రామంలో ఇప్పటికే ఏర్పాటుచేసిన అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం బమ్మెర శివారులో పాలకుర్తి వద్ద మాంగళ్య ఫంక్షన్హాల్లో నిర్వహించే సదస్సులో పాల్గొని చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
ఇప్పటికే పనిచేస్తున్న అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్
రైతులకు న్యాయ వ్యవస్థను దగ్గర చేసి చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గ్రామాల్లో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ సెంటర్లు ఏర్పాటుచేయాలని నల్సార్ వర్సిటీ కృష్ణదేవరావు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఈ సెంటర్ను ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్(లీఫ్)సంస్థ ఆధ్వర్యంలో బమ్మెరలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ను ఏర్పాటుచేశారు. దీనిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్, జస్టిస్ సంజయ్కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వర్చువల్గా ఈ ఏడాది మార్చి 18న ప్రారంభించారు. ఇక్కడి గ్రామపంచాయతీ కార్యాలయంలోని ఒక గదిలో నల్సార్ వర్సిటీ ఆధ్వర్యంలో పారా లీగల్ పేరుతో ఒక న్యాయ నిపుణుడు అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలు తెలుసుకొని సంబంధిత సంస్థలు, శాఖలు, వ్యక్తుల నుంచి వివరణ కోరుతున్నారు. రైతులకు సత్వర న్యాయం అందించేలా ఆయన పనిచేస్తున్నారు. భూమి, నీరు, విత్తనం, మార్కెట్ వంటి అంశాల్లో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు న్యాయ సహా యం అందిస్తున్నారు. విత్తన నాణ్యత, నాసిర కం ఎరువులు, పురుగు మందులు, కనీస గిట్టుబాటు వంటి అంశాల్లో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ కరపత్రాలు, వాల్పోస్టర్లను ప్రదర్శిస్తూ రైతులకు అవగాహనతోపాటు చైతన్యం కలిగిస్తున్నారు. 2,350 మంది జనాభా, 954 కుటుంబాలు ఉన్న బమ్మెర గ్రామంలో 4,088 ఎకరాల భూమి సాగవుతున్నది.
తెలంగాణలో మరిన్ని అగ్రి లీగల్ క్లినిక్లు.
బమ్మెరలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ విజయవంతమవడంతో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని నల్సార్ యూనివర్సిటీ రాష్ట్రంలోని మరిన్ని క్లినిక్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఆయా జిల్లాల జడ్జిలు, కోర్టులు, న్యాయవాదుల సహకారం కోరుతున్నారు. త్వరలోనే గిరిజన గ్రామంలో క్లినిక్ ప్రారంభించాలని నిర్ణయించింది.