శంషాబాద్ రూరల్, డిసెంబర్ 1: విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే విదేశాల్లో విద్యావకాశాలను అందిపుచ్చుకోవడం కష్టమేమీ కాదని వై యాక్సిస్ కన్సల్టెన్సీ ఉపాధ్యక్షుడు ఫైజల్ హుస్సేన్ అన్నారు. గురువారం శంషాబాద్ మండలం కాచారంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికల ఆధ్వర్యంలో ‘విదేశాల్లో ఉద్యోగావకాశాలు’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆంగ్ల భాషపై పట్టుసాధిస్తే విదేశీ చదువుల వేటలో సగం విజయం సాధించినట్టేనని చెప్పారు.
బీటెక్ పూర్తిచేసిన విద్యార్థుల్లో 90 శాతానికి పైగా మాస్టర్ డిగ్రీని విదేశాల్లో చదివేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. సరైన మార్గదర్శనం లేని కారణంగానే చాలామంది విదేశీ విద్యను పొందలేకపోతున్నారని చెప్పారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఉన్నత విద్యకు వెళ్లేందుకు కనీసం 7 నుంచి 14 నెలల సమయం పడుతుందని వివరించారు. విదేశాల్లో పై చదువులు చదవాలనుకొనే విద్యార్థులు వై-యాక్సిస్ను సంప్రదిస్తే సరైన సలహాలు, సూచనలు అందించి మార్గనిర్దేశనం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జేవీఆర్ రవీంద్ర, ఆసిఫ్, తెలంగాణ పబ్లికేషన్ ఈవెంట్ మేనేజర్ టీ గణేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
సదస్సులో తెలుసుకొన్న అంశాలతో విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యాభాస్యం చేయాలనుకొనే విద్యార్థులకు ఈ సదస్సు ఎంతో విలువైన సమాచారం అందించింది. కృషి, పట్టుదలతో చదివితే విదేశాల్లో మంచి ఉద్యోగాలు పొందవచ్చు.
-జేవీఆర్ రవీంద్ర, ప్రిన్సిపల్, వర్ధమాన్ కళాశాల
ఎంతో విలువైన సమాచారం
విదేశీ విద్యపై సమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు విద్యార్థుల్లోని అపోహలను తొలగించడానికి దోహదపడుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యాభాస్యం చేయాలనుకొనే విద్యార్థులకు ఎంతో విలువైన సమాచారం అందించారు.
-టీ విజేందర్రెడ్డి, కళాశాల చైర్మన్