హైదరాబాద్ సిటిబ్యూరో / చర్లపల్లి, డిసెంబర్ 28: డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సీటీ 25వ స్నాతకోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో మాజీ వీసీ వీఎస్ ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. 17 మంది ఖైదీలకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేశారు. 43 మంది విద్యార్థులకు బంగారు పతకాలు (డిగ్రీలో 17, పీజీలో 26) అందజేశారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ మాట్లాడుతూ.. 76 ఏండ్ల వయసు నిండిన వారు డిగ్రీలు పొందడం చాలా సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. డ్రైవర్, ఖైదీ, గృహిణి ఇలాంటి వారు డిగ్రీలు పొందడం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు.
యూనివర్సిటీ వీసీ సీతారామారావు మాట్లాడుతూ.. డిగ్రీలో 20,972 మంది, పీజీలో 10,757 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, వీరందరికీ పట్టాలు ప్రదానం చేశామని తెలిపారు. కాగా, చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న 17 మంది జీవిత ఖైదీలు బీఏ, పీజీలో సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పొలిటికల్ సైన్స్లో పట్టాలు అందుకొన్నట్టు జైలు సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్ తెలిపారు. అనంతరం డిగ్రీ పట్టాలు పొందిన ఖైదీ విద్యార్థులను అభినందించారు. సాత్నకోత్సవంలో పాలకమండలి సభ్యులు ఓయూ వీసీ రవీందర్ యాదవ్, ఆర్ శైలేశ్ రెడ్డి, డాక్టర్ బానోత్లాల్, రిజిస్ట్రార్ ఏవీఎన్ రెడ్డి, ప్రొఫెసర్లు ఘంటా చక్రపాణి, సుధారాణి, ప్రుష్పా చక్రపాణి, వడ్డానం శ్రీనివాస్, చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ సంతోష్రాయ్, జైలర్ గొట్టే రామకృష్ణ, వర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ 76 ఏండ్ల వయసులో పీహెచ్డీ సాధించారు. గురువారం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయనకు పీహెచ్డీ పట్టా ప్రదానం చేశారు. నేటితరంలో చాలామంది కనీసం పీజీ కూడా పూర్తి చేయడం లేదని, అలాంటివారికి తాను మార్గదర్శిగా నిలువాలనే పీహెచ్డీ చేశానని ఇస్మాయిల్ తెలిపారు. తాను 2018లో హిందీలో పీహెచ్డీ ప్రారంభించానని చెప్పారు. 1984లోనే హిందీలో పీజీ, ఎంఫిల్ పూర్తి చేసినట్టు వెల్లడించారు.