వారివి నిరుపేద కుటుంబాలు. పొద్దంతా ఆటో నడిపితేనే గడిచే జీవితాలు వారివి. ఉన్నంతలో భార్యాబిడ్డలతో ఆనందంగా గడుపుతున్న వారి జీవితాల్లో ఇటీవల కల్లోలం రేగింది. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటోలవైపు చూసేవారు కరువయ్యారు. రెండుమూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందని భావించినా రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారింది. గిరాకీ తగ్గి ఇల్లు గడవని పరిస్థితి నెలకొన్నది.
దుర్భరంగా మారిన తమ జీవితాలను ప్రభుత్వం ఆదుకోవాలని రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇల్లు గడిచేలా తమకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని వేడుకున్నారు. అయినా స్పందన లేదు. మరోవైపు, చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఫైనాన్స్ ద్వారా తెచ్చిన ఆటోలకు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోవడంతో ఆటోడ్రైవర్లపై ఒత్తిడి పెరిగింది. అది రోజురోజుకు మోయలేనంతగా మారడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడి తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి ఆటోడ్రైవర్ల కష్టాల వంక చూడాలని, మరింత మంది ఆత్మహత్యలను ఎంచుకోకముందే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపి ఆదుకోవాలని ఆటో సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆటో సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్
శరాఘాతంగా ‘ఉచిత బస్సు’
మహాలక్ష్మి పథకం కారణంగా కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాల్లో హైదరాబాద్లోని ఎంఎస్మక్తాకు చెందిన మహ్మద్ అఫ్సర్ (58) కుటుంబం కూడా ఒకటి. రెండు దశాబ్దాలుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అఫ్సర్కు ఉచిత బస్సు ప్రయాణం శరాఘాతంగా మారింది.
రోజంతా కష్టపడినా రూ. 500 కూడా గిట్టుబాటు కాకపోవడంతో కుటుంబం కష్టాలపాలైంది. మనోవేదనకు గురైన అఫ్సర్ డిసెంబర్ 18న గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అఫ్సర్ మృతి చెందాడు.
బంధువుల సాయంతో బతుకు
ఇంటి యజమాని చనిపోయి నెల రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఆటోను ఫైనాన్స్లో తీసుకోవడం వల్ల కిస్తీలు చెల్లించలేక మధ్యలోనే అమ్ముకున్నాం. నాకేమో ఆరోగ్యం బాగుండదు. ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఇప్పుడు మా కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. మా బంధువులందరూ తలా కొంత ఆర్థికసాయం చేయడంతో కుటుంబం గడుస్తోంది. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి. – మస్రత్ బేగం, మహ్మద్ అఫ్సర్ భార్య
భవిష్యత్తు అంధకారంగా మారడంతో..
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన వేముల సత్యనారాయణ (58) వ్యధ మరోటి. కొన్నాళ్లు మహారాష్ట్రలోని భీవండిలో పవర్లూమ్స్ నడిపి కుటుంబాన్ని పోషించిన ఆయన ఆ తర్వాత స్వగ్రామం వచ్చి ఆటోడ్రైవర్గా మారాడు.
ఈ క్రమంలో ముగ్గురు అమ్మాయిలకు పెండ్లి చేసి అత్తారింటికి పంపాడు. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న జీవితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అతలాకుతలమైంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో ఆటో ఎక్కేవాళ్లు లేక ఖర్చులకు కూడా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భవిష్యత్తు అంధకారంగా మారడంతో అవే ఆలోచనలతో జనవరి 14న అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు.
37 ఏండ్లు ఆటో నడిపిండు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలకు గిరాకీ తగ్గిందని, ఆటోస్టాండు వద్ద పొద్దంతా ఎదురుచూసినా గిరాకీ రావట్లేదని నా భర్త రోజూ చెప్పి బాధపడుతుండేవాడు. నేను బీడీలు చేస్తున్నా, అవసరమైతే కూలికి పోతా అని ధైర్యం చెప్పేదాన్ని. అయినా ఎప్పుడూ ఆలోచిస్తూ రందితో ఉండేటోడు. పండుగలకు పిల్లల్ని పిలిచి వారికి ఏం పెడతామని ఊకే అంటుండే. జనవరి 14న రాత్రి 11 గంటల సమయంలో ఇబ్బంది పడుతుంటే చూసి డాక్టర్ వద్దకు పోయి వచ్చేసరికే ప్రాణాలు వదిలిండు. ఇప్పుడు ఎవరు మాకు ఆదెరువు? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు?
– అనురాధ, సత్యనారాయణ భార్య
ఆటో ఆగింది.. ప్రాణం పోయింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన తోటేటి రామలింగయ్య ఫిబ్రవరి 5న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆటోకు గిరాకీ తగ్గి పెట్రోలు ఖర్చులకు కూడా డబ్బులు రాకపోవడం, కుటుంబ పోషణ దుర్భరంగా మారడంతో రామలింగయ్య మనస్తాపం చెందాడు. దీనికి తోడు ఆటోపై ఉన్న రూ. 70 వేల అప్పు తీర్చే మార్గం కనిపిచకపోవడంతో మరో దారిలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణం కుటుంబాన్ని అనాథను చేసింది. రామలింగయ్య మరణంతో భార్య మౌనిక (27), పిల్లలు చరణ్ (11), తనుశ్రీ (6) దిక్కులేనివాళ్లయ్యారు.
తల్లీ పిల్లలను ఆదుకోవాలి
నా కొడుకు మృతితో అనాథగా మారిన మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బతకడానికి సెంటుభూమి కూడా లేదు. భూమి కౌలుకు తీసుకుని సాగుచేస్తే నష్టమొచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలే. కొడుకు మృతితో కోడలు, పిల్లల ఆగమయ్యారు. పిల్లల చదువులు సాగుడెట్లనో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకుని మాకొక దారి చూపించాలి.
-మల్లయ్య, రామలింగయ్య తండ్రి, బచ్చన్నగూడెం, కొత్తగూడెం
నరేశ్ ఆత్మహత్యతో కుటుంబం కకావికలం
హైదరాబాద్ శివారులోని నాచారం దుర్గానగర్కు చెందిన ఆటో డ్రైవర్ నరేశ్ (23) రెండు వారాల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. నరేశ్ తల్లిదండ్రులు నిమ్మగళ్ల గోపాల్-జ్యోతి దంపతులు 30 ఏండ్ల క్రితం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం మర్రిపల్లి గ్రామం నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి నాచారం దుర్గానగర్లో స్థిరపడ్డారు.
వీరికి సతీశ్, నరేశ్ అనే కుమారులతోపాటు కుమార్తె కూడా ఉంది. గోపాల్తోపాటు పెద్ద కొడుకు సతీశ్ కూడా ఆటోనే నడిపేవారు. వారి సంపాదన కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో చదువును మధ్యలోనే వదిలిపెట్టిన నరేశ్ కూడా ఆటో డ్రైవర్గా మారాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆటోలకు గిరాకీ తగ్గడంతో ఆర్థికంగా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన నరేశ్ ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. కుటుంబానికి ఆసరా అవుతాడనుకున్న కొడుకు అర్ధాంతరంగా తనవు చాలించడంతో కుటుంబం బోరున విలపిస్తున్నది.
పురుగుల మందు తాగి..
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 64వ డివిజన్ టేకులగూడెం గ్రామానికి చెందిన ఎండీ సమీర్పాషా(22) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పులు పెరగడంతో ఆటో అమ్ముకుని కిరాయి ఆటో నడుపుతున్నాడు.
రెండేండ్ల క్రితం కౌసర్తో వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర కూతురు సమీహ ఉన్నది. కుటుంబం సమీర్ సంపాదన మీదే ఆధారపడడం, తెచ్చిన అప్పులు తీర్చలేక, వడ్డీలు చెల్లించలేకపోవడంతో ఒత్తిడి పెరిగింది. ఏ దారీ కనిపించకపోవడంతో జనవరి 18న ఊరు చివర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ 19న రాత్రి మృతి చెందాడు.
ప్రభుత్వమే ఆదుకోవాలి
నా కొడుకు చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. ఆటో నడిపితే వచ్చే పైసలతోనే మేం బతకుతున్నాం. అప్పులు పెరిగిపోవడంతో నా బిడ్డ లోలోపలే బాధపడుతుండేవాడు. మాకిప్పుడు బతుకుదెరువు లేకుండా పోయింది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి. ఏడాదిన్నర బిడ్డను చదివించుకోవాలి. మా కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వమే ఆర్థికసాయం అందించి మమల్ని ఆదుకోవాలి. డబుల్ బె డ్రూం ఇల్లు మంజూరు చేసి, మా కోడలికి చిన్న ఉద్యోగం ఇస్తే కుటుంబాన్ని పోషించుకుంటుంది. మహాలక్ష్మి పథకంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆటోడ్రైవర్ల కుటుంబాలను కాంగ్రెస్ ప్రభుత్వమే ఆదుకోవాలి.
-ఎండీ నాజ్మా, (సమీర్పాషా తల్లి)
పథకం అమలైన ఐదు రోజులకే
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి పంచాయతీ పరిధిలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పెండెల సారయ్య మహాలక్ష్మి పథకం అమలైన ఐదు రోజులకే గుండెపోటుతో మృతి చెందాడు. అతడికి భార్య ఎల్లవ్వ, కుమారుడు హరీశ్, కుమార్తె రాధిక ఉన్నారు. 14 ఏండ్లుగా ఆటో నడుపుతూ జీవిస్తున్న సారయ్య అప్పు చేసి కుమార్తె వివాహం చేశాడు. వాటిని తీర్చేందుకు భార్య కూలి పనులకు కూడా వెళ్తున్నది. ఈ క్రమంలో ఫైనాన్స్ కట్టకపోవడంతో నిరుడు డిసెంబర్ 9న ఫైనాన్షియర్లు ఆటో తీసుకెళ్లారు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన సారయ్య అప్పుచేసి ఫైనాన్స్ కట్టి ఆటో తిరిగి తెచ్చుకోవాలని భావించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. ఆటో తీసుకొచ్చినా ఫలితం ఉండదనుకుని రందిపెట్టుకున్నాడు. డిసెంబరు 13న గుండెపోటుతో మృతి చెందాడు. సారయ్య మృతితో భార్య, కుమారుడు దిక్కులేనివారయ్యారు. తమకు రూ. 7 లక్షల వరకు అప్పులు ఉన్నాయని, ఇల్లు అమ్మినా తీరే పరిస్థితి లేదని ఎల్లవ్వ ఆవేదన వ్యక్తం చేసింది. సర్కారు నిర్ణయం వల్ల తమ కుటుంబం రోడ్డుమీద పడిందని కన్నీళ్లు పెట్టుకుంది.
గుండెపోటుతో కొడుకు మృతి.. ఆగిన తల్లి గుండె
మెదక్ జిల్లా హవేలీఘణపూర్ మండలం కూచన్పల్లి గ్రామానికి చెందిన వీరప్పగారి నర్సాగౌడ్(35) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. 14 ఏండ్లుగా ఆటోను నమ్ముకుని బతుకుతున్న నర్సాగౌడ్కు భార్య లత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఉన్న నాలుగు లక్షల అప్పు తీర్చేందుకు భార్య మెడలోని రెండు తులాల బంగారు నగలు అమ్మేశాడు.
అయినా అప్పు పూర్తిగా తీరలేదు. దీనికితోడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక మహాలక్ష్మి పథకం అమలు చేయడంతో ఆటోకి గిరాకీ తగ్గింది. దీంతో నర్సాగౌడ్ ఆందోళన చెందాడు. తీవ్ర మానసక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో జనవరి 6న తెల్లవారుజామున చాతీలో నొప్పితో కుప్పకూలి మరణించాడు. కొడుకు మరణవార్త విని తల్లి లక్ష్మి గుండె ఆగి చనిపోయింది. తల్లీ కొడుకుల మృతితో కూచన్పల్లిలో విషాదం అలముకున్నది.
ఫ్రీ బస్సు ఆటోలు నడవకుండా చేసింది
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టి ఆటోలు నడవకుండా చేసింది. ఆటో నడవక నా భర్త నర్సాగౌడ్ గుండెపోటుతో చనిపోయాడు. అది విన్న అత్తమ్మ లక్ష్మి కూడా గుండెపోటుతో కుప్పకూలి మరణించింది. మా కుటుంబానికి ఇప్పుడు పెద్ద దిక్కున్నదే లేకుండా పోయింది. నా కూతురు 9వ తరగతి, కూతురు ఏడో తరగతి చదువుతున్నది. వారిని ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. మా కుటుంబాన్ని సర్కారే ఆదుకోవాలి. ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-లత, మృతుడి భార్య, కూచన్పల్లి (మెదక్ జిల్లా)
ఆటోతో పాటే పోయిన ప్రాణం
నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి గ్రామానికి చెందిన ఎస్కే గులాం(44) ఆటో డ్రైవర్. భార్య పర్వీన్తో నలుగురు కూతుళ్లు, కుమారుడితో ఉన్నంతలో హాయిగానే జీవిస్తున్నాడు. నిరుడు అప్పు చేసి పెద్ద కుమార్తె పెళ్లి జరిపించారు. ఆటోకు గిరాకీ బాగానే వస్తుండడంతో వడ్డీలు కడుతున్నాడు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోలు ఎక్కేవారు తక్కువయ్యారు. దీంతో వడ్డీలు కట్టలేక అవస్థలు పడ్డాడు. అప్పులు రూ. 8 లక్షలకు వరకు చేరడం వాటికి నెలనెలా వడ్డీలు కట్టడం తలకు మించిన భారంగా మారడం గులాంను తీవ్రంగా కలచివేసింది. ఇక, తన వల్ల కాదని భావించిన గులాం జనవరి 19న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రోడ్డున పడ్డాం..ఆదుకోండి
నా భర్త ఆటో నడుపుతూ మమ్మల్ని పోషించాడు. పెద్ద కూతురి పెళ్లి, పిల్లల చదువులు, ఆటో రిపేర్లకు కలిపి రూ.8 లక్షల వరకు అప్పు అయింది. వాటికి అప్పులు కట్టలేక నా భర్త ఎప్పుడూ బాధపడుతుండె. మమ్మల్ని రంగాపూర్ ఉర్సుకు పంపి ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆయన చనిపోవడంతో మేమంతా రోడ్డున పడ్డాం. మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
ఉపాధి కోల్పోయి ఆత్మహత్య
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లికి చెందిన ఏకుల ఉపేందర్(24) ఫైనాన్స్లో రుణం తీసుకుని ప్యాసింజర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం అడవిదేవులపల్లి నుంచి మిర్యాలగూడ రూట్లో ఆటో తోలి కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆటో బాగా నడువడంతో కుటుంబానికి ఖర్చులు పోగా ఫైనాన్స్ కిస్తులు కట్టేవాడు.
ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చిన తర్వాత ఆటోలవైపు చూసేవారు కరువయ్యారు. రోజంతా ఆటో నడిపినా డీజిల్ ఖర్చులు కూడా రాకపోవడంతో ఫైనాన్స్ కట్టలేకపోయాడు. మరోవైపు కుటుంబ పోషణ కూడా భారంగా మారడంతో మనస్తాపం చెంది జనవరి 25న రాత్రి అడవిదేవులపల్లి శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఉపేందర్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎదిగిన బిడ్డను పోగొట్టుకున్నం
నాకు ఇద్దరు కొడుకులు. వారిని పెద్ద చదువులు చదివించలేక పదో తరగతి తర్వాత ఆటో డ్రైవర్లను చేశా. వారు రోజు ఆటో నడిపి కాస్తోకూస్తో ఇంటికి తెచ్చిన డబ్బులతో ఇల్లు గడిచేది. మహిళకు బస్సు ఉచితం అనేసరికి ఆటోలు సరిగా నడవలేదు. ఇల్లు గడవక ఫైనాన్స్ వాళ్లకు కిస్తులు కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి ఉపేందర్ చనిపోయిండు. ఎదిగిన బిడ్డను పోగొట్టుకుని రోడ్డునపడ్డాం.
– ఏకుల లింగమ్మ (ఉపేందర్ తల్లి)
రుణాలు చెల్లించలేక..
ముడావత్ రాహుల్.. వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం బాపల్లి తండావాసి. ఏడో తరగతి తర్వాత చదువుపై ఆసక్తి లేక తల్లిదండ్రులతో కలిసి కూలీ పనిచేసేందుకు ముంబయి వెళ్లాడు. కొంతకాలం తర్వాత సొంతూరిలోనే ఏదో ఒక పని చేసుకుందామని ఇల్లు చేరాడు. ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. గత ఏడాది జూలైలో ఫైనాన్స్ ద్వారా ఆటో కొనుగోలు చేశాడు.
ఆ సమయంలో డౌన్ పేమెంట్ కోసం పరిచయస్తుల దగ్గర రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. హైదరాబాద్లో అయితే తొందరగా అప్పు చెల్లించడంతోపాటు ఇల్లు గడుస్తుందని భావించాడు. ఆరె మైసమ్మ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ ప్రతి నెలా రూ.25 వేల వరకు సంపాదిస్తూ క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లించాడు. ఉన్నత చదువులు అభ్యసిస్తున్న ఇద్దరు అన్నలకు కూడా ఆర్థికంగా అండగా నిలిచాడు. అలా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రాహుల్ ఇటీవల ఆటోలకు గిరాకీ తగ్గడంతో రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో బలవన్మరణం చెందాడు.
ప్రభుత్వ నిర్ణయంతో రోడ్డున పడ్డాం…
మాకున్నది ఎకరం పొలం. వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. ఇద్దరం అన్నదమ్ములం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం. మా పుస్తకాలు, ఖర్చులకు మా తమ్ముడు రాహుల్ డబ్బులు సమకూర్చేవాడు. ఇప్పుడు వాడు లేడు. అంతా శూన్యంగా మారింది. చదువు పక్కన పెట్టి ప్రైవేటు ఉద్యోగాన్వేషణ మొదలు పెటాం. ఈఎంఐల కోసం ఫైనాన్స్ వారు ఫోన్లు చేస్తున్నారు. ఆటో ఇంటి ముందు ఉంటే దాన్ని చూస్తూ అమ్మానాన్నలు ఏడుస్తున్నరు. అందుకే దాన్ని బంధువుల ఇంట్లో ఉంచాం. ప్రభుత్వం నిర్ణయానికి మాలాంటి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
– ముడావత్ సురేశ్, మృతుడి సోదరుడు
నేడు ఆటో బంద్ను విజయవంతం చేయాలి : టీఏటీయూ
రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఆటో బంద్ను విజయవంతం చేయాలని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లు సంబంధిత జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్లో పాల్గొనాలని సూచించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సుందరయ్య విజాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ర్యాలీకి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కదిలిరావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్లు తమ ఉపాధిని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.