హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 ( నమస్తే తెలంగాణ ) : వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఓటమే లక్ష్యంగా ఆటోడ్రైవర్లు కదంతొక్కారు. ‘డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించని కాంగ్రెస్ను ఓడించాలి.. తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీకి బుద్ధిచెప్పాలి’ అంటూ ఆటోడ్రైవర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు సుమారు 45 మందికిపైగా మరణించినా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నదని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు తాము రోడ్డెక్కే దుస్థితి రాలేదని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ.. గురువారం చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో ఆటోడ్రైవర్లు ప్రచారం నిర్వహించినట్టు వివరించారు.