కరీంనగర్ రూరల్: ఫిబ్రవరి 18: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల మరణాలు ఆగడం లేదు. గిరాకీ లేక పూట గడవక గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ రెండు నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ప్రాణాలు విడిచారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలాడు. కరీంనగర్ జిల్లా దుర్శేడ్కు చెందిన పూదరి రమేశ్గౌడ్ (40) పదహారేండ్లుగా ఆటో నడుపుతూ భార్యాబిడ్డలను, వృద్ధులైన తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలో జనాలు ఎక్కడంలేదు. దీంతో నెలవారి కిస్తీలు కూడా చెల్లించడంలేదు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఛాతీలో నొప్పివస్తుందంటూ ఇంట్లోనే కుప్పకూలాడు. కుటుంబసభ్యులు గమనించి దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. ఇంటి పెద్దదిక్కు మృతితో తల్లిదండ్రులు లచ్చవ్వ, మల్లయ్య, భార్య స్వరూప, కొడుకులు అరుణ్, తరుణ్ భోరున విలపించారు. తమకు దిక్కెవరూ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. రమేశ్గౌడ్ మరణానికి కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలని కరీంనగర్ చల్మెడ, దుర్శేడ్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తక్షణమే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.