హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెలంగాణ ఆటో మోటర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ ఆడబిడ్డపై బీజేపీ కావాలనే అసత్య ఆరోపణలు చేస్తూ కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. ఈ దేశానికి పట్టిన బీజేపీ పీడను వదిలించే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను ప్రకటించినప్పటి నుంచి బీజేపీలో వణుకు మొదలైందని చెప్పారు. ప్రధాని మోదీ ఎంత భయపడుతున్నారో.. రాష్ట్రంలో ఐటీ, ఈడీ సోదాలే నిదర్శనమని పేర్కొన్నారు. నాచారంలోని టీఆర్ఎస్కేవీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆటోమోటర్ రవాణా రంగం విభాగం అధ్యక్షుడు వేముల మారయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టిందని అన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే బీజేపీ నాయకులను తరిమికొడతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండునాయక్, నాయకులు గడ్డం శ్రీనివాస్, కొరేపాక అంజన్న, ఏ నరేశ్కుమార్, పోలె నిరంజన్, అహ్మద్, శాతం రమేశ్, కుమార్, సాయికుమార్, రామాంజనేయులు, చంద్రమౌళి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.