మంథని, ఏప్రిల్ 21: ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24 నుంచి 28 వరకు తహసీల్దార్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తామని ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, అధికార ప్రతినిధి దార మధు వెల్లడించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఆటో డ్రైవర్లతో ఆదివారం ప్ర త్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పేరుతో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి కరువైందని తెలిపారు. దీంతో ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 24న తహసీల్దార్లకు, 26న కలెక్టర్లకు, 28న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను సమర్పిస్తామని చెప్పారు. ఈ నెల 30 నుంచి రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయి సదస్సులను, మే 9న మహబూబాబాద్లో రాష్ట్ర స్థాయి బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు నరసయ్య, యాసిన్, రమేశ్, ప్రసాద్, నవీన్, కట్ల సతీశ్, రాజు, తోటపల్లి సంతోష్, తుంగల శ్రీనివాస్, విష్ణు, సలీం, ఖదీర్, బుక శ్రీనివాస్ పాల్గొన్నారు.