Free bus for Women | జన్నారం, డిసెంబర్ 11: కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణం వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని, ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని పలు ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారంలో ఆటో, టాటా ఏస్, జీప్ యూనియన్ అధ్యక్షుడు నసీరొద్దీన్, షేక్బాబా ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు.
తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ రామ్మోహన్కు వినితి పత్రం అందజేశారు. ఈ పథకం వల్ల ఆటోలు, టాటా ఏస్, జీపు డ్రైవర్లతో పాటు గ్యారేజీలు, ఆటోమొబైల్ వ్యాపారం చేసే వారంతా రోడ్డున పడే పరిస్థితి ఉందని, ప్రభుత్వం పునరాలోచించి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మొగిళి, పీ ప్రభుదాస్, డీ శంకర్, కే రాజన్న తదితరులు పాల్గొన్నారు.