Free Bus For Women | ఖైరతాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక.. కుటుంబాన్ని పోషించుకోలేక మనస్తాపానికి గురైన ఓ ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్లూ చేసిన వృత్తిని వదిలేసి కొత్త ఉద్యోగంలోకి చేరితే నెట్టుకొస్తానా? పెండ్లి అవుతుందా? అని లోలోన కుమిలిపోయిన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ విషాద ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో చోటుచేసుకొన్నది. పంజాగుట్ట పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సోమాజిగూడలోని బీఎస్ మక్తాలో పీ సతీశ్గౌడ్ (35) 15 ఏండ్లుగా ఆటో నడుపుతున్నాడు. ఓ కిరాయి ఇల్లు తీసుకొని తల్లి సరోజ, సోదరులు వెంకటేశ్గౌడ్, రమేశ్గౌడ్తో ఉంటున్నాడు. ఇన్నాళ్లూ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు.
కాంగ్రెస్ సర్కారు తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు స్కీంతో ఆటోలకు గిరాకీ తగ్గిపోయింది. దీంతో సతీశ్గౌడ్ ఇలా అయితే తనకు పెండ్లి ఎలా అవుతుందని, కుటుంబాన్ని ఎలా పోషించాలని మనస్తాపం చెందాడు. తన కుటుంబానికి తిండిపెడుతున్న ఆటోను అమ్మేసి, వేరే ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులతో కొన్ని రోజులుగా చర్చించాడు. వేరే ఉద్యోగం దొరుకుతుందో లేదో అని మధనపడ్డాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిమ్లో శిక్షకుడైన సతీశ్ సోదరుడు వెంకటేశ్గౌడ్ ఫిర్యాదు చేయడంతో పంజాగుట్ట పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
సతీశ్గౌడ్ 15 ఏండ్లుగా ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, రోజుకు 1,500 నుంచి 2 వేల వరకు సంపాదించేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆటో ద్వారా సంపాదించిన డబ్బులతో చెల్లె పెండ్లి కూడా చేశాడని వెల్లడించారు. ప్రస్తుత ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టడంతో పదిహేను రోజులుగా సతీశ్గౌడ్ గిరాకీలేక డీలా పడిపోయాడని, రోజుకు 300 నుంచి 400 మించి రాకపోవడంతో ఇంటి కిరాయి, తల్లి, కుటుంబ పోషణ భారంగా మారి మనస్తాపానికి గురయ్యాడని తెలిపారు.
సొంత ఇల్లు కట్టుకొని, పెండ్లి చేసుకొని తల్లిని, తమ్ముళ్లను బాగా చూసుకుందామని సతీశ్గౌడ్ కన్న కలలు కల్లలైపోయాయని ఆవేదన చెందారు. చివరికి ఆటోను అమ్ముకొని ఏదైనా ఉద్యోగం చేద్దామని అనుకున్నాడని, కానీ 35 ఏండ్ల వయస్సులో ఏం ఉద్యోగం చేయాలన్న మానసిక సంఘర్షణ తట్టుకోలేక తనువు చాలించాడని కన్నీరుమున్నీరయ్యారు. తమ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయామని రోదించారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకొన్నారు.