Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో/ఖైరతాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): అది బేగంపేట్లోని ప్రజాభవన్.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ప్రజలవాణిని వింటామని చెప్పి పేరుమార్చిన భవనం. సాక్షాత్తు దాని ఎదుటే గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ ఆటో వచ్చి ఆగింది. అందులోనుంచి దిగిన డ్రైవర్ జేబులోనుంచి అగ్గిపెట్టె తీసి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టివిక్కమార్క ఫ్లెక్సీ ఎదుట నిలిపిన ఆటోపై పెట్రోల్పోసి నిప్పంటించాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఆటో పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఆ ఆటోడ్రైవర్ మంటలవైపు వెళ్తుండగా వెంటనే పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. అటునుంచి వెళ్తున్న ప్రజలు ఇది చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. దీంతో ఆటోలకు గిరాకీ తగ్గిపోయిందంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు ఆందోళన బాటపట్టారు.
జీవనోపాధి దెబ్బతిన్నదనే మనస్థాపంతో ఇప్పటివరకూ 14 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రజాభవన్ ఎదుట మియాపూర్కు చెందిన దేవ్లానాయక్ (45) అనే ఆటో డ్రైవర్ గురువారం తన ఆటోకు తానే నిప్పంటించుకొన్న సంఘటన సంచలనంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని మనస్థాపం చెంది ఈ ఘటనకు పాల్పడ్డట్టు దేవ్లానాయక్ తెలిపారు. తన కండ్ల ఎదుట తగలబడుతున్న ఆటోను చూస్తూ కన్నీంటిపర్యంతయ్యాడు. విలేకరులతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. ‘నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక్క కొడుకు, భార్య ఉన్నారు. పదేండ్ల నుంచి ఆటోనే ఆధారం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించి మా బతుకుల్లో చీకట్లు నింపింది. గిరాకీ లేదు. ఈఎంఐలు, కుటుంబ ఖర్చులు ఎలా భరించగలం? నా బతుకు రోడ్డున పడ్డది.. ఇప్పుడు నా కుటుంబాన్ని పోషించడమెలా? 50 రోజులు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేమేం పాపం చేశాం? గిరాకీ లేని ఆటోను ఏం చేసుకోవాలి? నా ఆటోను నేనే ప్రజాభవన్ ముందు తగలబెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది’ అంటూ రోదించాడు. ఆటో నడిపి రోజుకు రెండు వేలకుపైగా సంపాదించే వాడినని, ఇప్పుడు ఐదు వందలకు మించడంలేదని వాపోయాడు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.