పెగడపల్లి, ఫిబ్రవరి 7: ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక మరో ఆటో డ్రైవర్ గుండె ఆగిపోయింది. 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం సాగించిన ఆయన ఏడాదికాలంగా సరిగా నడువకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అప్పుల భారంతో మనోవేదనకు గురై గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లికి చెందిన ఆటో డ్రైవర్ బొమ్మెన మాణిక్యం(45) 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం సాగిస్తున్నాడు. ఏడాదికాలంగా ఆటో సరిగా నడువక పోవడంతో ఫైనాన్స్ కిస్తీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఇంటిపై తీసుకున్న అప్పులు కూడా భారం కావడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి మృతి చెందాడు. మాణిక్యానికి భార్య జమున, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మాణిక్యం కుటుంబాన్ని ఆదుకోవాలని పెగడపల్లి ఆటో యూనియన్ అధ్యక్షుడు భోగ భూమయ్య, గౌరవాధ్యక్షుడు బొమ్మెన స్వామి, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బొమ్మెన స్వామి, ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.