కరీంనగర్ రూరల్: ఫిబ్రవరి 18: రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto driver) మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీతో ఉపాధి కోల్పోయిన ఓ ఆటో డ్రైవర్ మనోవేదనతో కుప్పకూలాడు. దవాఖానకు తరలిస్తుండగా మార్గంమధ్యలో కన్నుమూశాడు. కుటుంబసభ్యుల తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్( Karimnagar) జిల్లా దుర్శేడ్కు చెందిన పూదరి రమేశ్గౌడ్(40) 16 ఏండ్లుగా ఆటో నడుపుతూ వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు.
అయితే కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోలో జనాలు ఎక్కడం లేదు. దీంతో నెలవారి కిస్తీలు కూడా చెల్లించడంలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఏడు గంటలకు ఛాతిలో నొప్పివస్తుందంటూ ఇంటిలోనే కుప్పకూలాడు. కుటుంబసభ్యులు గమనించి దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు.
ఇంటి పెద్దదిక్కు మరణంతో తల్లిదండ్రులు లచ్చవ్వ, మల్లయ్య, భార్య స్వరూప, కొడుకులు అరుణ్, తరుణ్ బోరున విలపించారు. ఇగ మాకు దిక్కెవరూ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. కాగా, రమేశ్గౌడ్ మరణానికి కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలని కరీంనగర్ చల్మెడ, దుర్శేడ్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. తక్షణమే రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు.