హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో రోజుకో వివాదం బయటపడుతున్నది. శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో పేపర్ లీకేజీకి ప్రయత్నం చేసిన ఘటన మరువకముందే తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ పరీక్షాకేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి పేపర్ బండిల్స్ను తెరిచే క్రమంలో సెల్ఫోన్తో వీడియో తీశారు. స్కాడ్ వారిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సెల్ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ప్రశ్నపత్రాలు ఓపెన్ చేసే సమయంలో పట్టుకోగా, పేపర్ లీకేజీ జరిగిందా.. లేదా? అన్నది విచారణ తర్వాతే తేలనున్నది.
ఈ కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీఐఈవోను ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశించారు. శనివారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అధికారులు సెల్ఫోన్లపై అంక్షలు కఠినతరం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ సైదయ్యను అధికారులు సస్పెండ్ చేశారు. డిపార్ట్మెంటల్ అధికారి మహ్మద్ ఫారూఖ్ అలీ ఖలీద్ (మోడల్ స్కూల్ జూనియర్ లెక్చరర్)ను సస్పెండ్ చేయాలని మోడల్ స్కూల్ అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పరీక్షాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇంగ్లిష్ పరీక్ష సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా సంబంధిత సబ్జెక్టు లెక్చరర్ సునీత పరీక్ష కేంద్రంలో ఉండటాన్ని అధికారులు గుర్తించారు. విచారణ అనంతరం శనివారం సునీత, బాధ్యులైన చీఫ్ సూపరింటెండెంట్ రవి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రాజు సస్పెన్షన్కు గురయ్యారు.
శనివారం సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పేపర్కు పరీక్షను నిర్వహించారు. మొత్తం 4,49,868 విద్యార్థులకు 4,35,387 విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 14,481 (3.21 శాతం) విద్యార్థులు గైర్హాజరయ్యారు. మూడు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. జనగాంలో ఇద్దరు, ఖమ్మంలో ఒక విద్యార్థి మాల్ప్రాక్టీస్కు పాల్పడగా, అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.