హైదరాబాద్ : నగరంలో తండ్రికొడుకుల దారుణ హత్య కలకలం రేపుతుంది. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద నివాసముంటున్న తండ్రికొడుకులపై దుండగులు దాడికి పాల్పడి హత్య చేశారు. శుక్రవారం ఉదయం జరిగిన ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం కాలనీలో నరసింహ శర్మ(78), కొడుకు శ్రీనివాస్ (35) నివాసముంటున్నారు. దుండగులు ఇంటిలోకి ప్రవేశించి నరసింహను గొడ్డలితో దాడి చేస్తుండగా అడ్డువచ్చిన కొడుకునూ అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు.
తనపై కూడా కత్తితో బెదిరించారని పనిమనిషి వెల్లడించింది. నీలిరంగు షర్టు వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు.
దుండగులను పట్టుకోవడానికి క్లూస్టీం బృందాలుగా వీడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే తమ బంధువులే హత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.