కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోనే అత్యధిక గిరిజన జనాభా కలిగిన ఆదిలాబాద్పై కేంద్రం చిన్న చూపు చూస్తున్నదని బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు విమర్శించారు. గతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినట్టే ఇచ్చి వేరే ప్రాంతానికి తరలించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను గెలిపిస్తే ఆదిలాబాద్కు గిరిజన యూనివర్సిటీ తీసుకురావడంతోపాటు ఆదిలాబాద్ నుంచి ఆర్మూరు వరకు రైల్వేలైన్, రెబ్బనలో ఓవర్ బ్రిడ్జి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఎంపీ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతున్నది?
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తున్నాం. పోలింగ్ బూత్లవారీగా కమిటీలు పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. రాత్రి, పగలు తేడా లేకుండా ప్రచారం చేస్తున్నాం. కార్యకర్తలు, నాయకులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించి తీరుతాం.
బరిలో ఉన్న ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు గోండు తెగకు చెందిన వారే. ప్రజలు మీవైపే ఉంటారని ఎలా భావిస్తున్నారు?
నేను ఉద్యమం నుంచి వచ్చిన వాడిని. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే ఆదివాసీల కోసం ఉద్యమాలు చేశా. వారి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చా. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందా. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నా. ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆదివాసుల సమస్యలు తెలియవు. నావైపే ఆదిలాబాద్ ప్రజలు, ఆదివాసీలు ఉన్నారని నమ్ముతున్నా. వారు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా.
రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ అంటోంది. దీనిపై మీరేమంటారు?
ప్రపంచ మేధావి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎస్సీఎస్టీలకే కాదు, బీసీ, ఇతర అణగారిన వర్గాలకు రక్షణ కవచం వంటిది. ఇలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ప్రకటించడడం దేశానికి శ్రేయస్కరం కాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాసేందుకే బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నది. రాజ్యాంగాన్ని మారిస్తే ఎవరూ ఊరుకోరు.
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ రిజర్వేషన్లపై కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాలు చేసింది. కేంద్రం వాటిని పక్కన పెట్టింది. దీనిపై మీ స్పందన ఏమిటి?
కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. వాటిని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తొక్కిపెట్టింది. కేంద్రం మెడలు వంచైనా వాటిని సాధించేందుకు కృషి చేస్తా.
కాంగ్రెస్, బీజేపీ తమతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నాయి. దీనిపై మీ కామెంట్?
జాతీయ పార్టీలకు వాటి ప్రయోజనం తప్ప అభివృద్ధి పట్టదు. వారికి కావాల్సిన నాయకులు ఉన్న ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిపై ఏ జాతీయ పార్టీకీ చిత్తశుద్ధి లేదు. ప్రాంతీయ పార్టీలతోనే మారుమూల ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుంది.
ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది?
బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించి తప్పు చేశామని బాధపడుతున్నారు. ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన నాకు కేసీఆర్ ఎంపీగా అవకాశం కల్పించడంపై ఆదివాసీలతోపాటు, జిల్లా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని ప్రజలే బాహాటంగా ప్రకటించడం సంతోషంగా ఉంది. కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు.