అంతర్జాతీయ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు స్పష్టీకరణ
400 లైబ్రరీలకు ‘ఒదిగిన కాలం’ ఆత్మకథ గ్రంథాల అందజేత
రవీంద్రభారతి, మార్చి 5: క్యాన్సర్కు ఎవరూ భయపడనక్కర్లేదని, ఆ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యనిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు స్పష్టం చేశారు. ఆడవాళ్లకు వచ్చే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను స్క్రీనింగ్ ద్వారా తొలిదశలోనే నివారించవచ్చని పేర్కొన్నారు. ఆధునిక క్యాన్సర్ చికిత్సగా పరిగణించే ‘ఇమ్యునో థెరపీ’ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. ‘ఒదిగిన కాలం’ పేరుతో ఆయన రాసిన ఆత్మకథ గ్రంథాన్ని తెలంగాణలోని 400 లైబ్రరీలకు అందజేశారు. ఈ సందర్భంగా శనివారం రవీంద్రభారతిలోని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలకు పుస్తకాలను బహూకరించే సంస్కృతి మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో ఆధునిక గ్రంథాలయ భవనాల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నదని తెలిపారు. గ్రామీణ గ్రంథాలయాలను డిజిటల్ లైబ్రరీలుగా తీర్చిదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.