Congress | బాన్సువాడ/పెద్దకొడప్గల్, నవంబర్ 8: అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కల్లోలం చెలరేగుతున్నది. బాన్సువాడ, జుక్కల్ టికెట్ల కేటాయింపు వ్యవహారం.. ఆశావహుల ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడ సెగ్మెంట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాసుల బాలరాజు ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. అయితే.. అధిష్ఠానం ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎల్లారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డికి ఇచ్చింది. ఈ మేరకు అధిష్ఠానం తీరును నిరసిస్తూ.. బుధవారం బాన్సువాడలోని తన నివాసంలో బాలరాజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాసుల.. పదేండ్లుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి పోరాటాలు చేసిన తనను కాదని.. ఎక్కడి నుంచో వచ్చిన ఏనుగు రవీందర్రెడ్డికి టికెట్ కేటాయించడంపై కన్నీరుపెట్టుకున్నారు. ఇంతలో.. ఇంట్లోకి వెళ్లి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక పురుగుల మందు తాగారు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు, అనుచరులు ఆయనను బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించారు.
విషయం తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్రెడ్డి హుటాహుటిన దవాఖానకు చేరుకొని కాసులను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలరాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచన మేరకు కాసులను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు.. జుక్కల్ కాంగ్రెస్లోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు సౌదాగర్ గంగారాంకు కాకుండా కాంగ్రెస్ అధిష్ఠానం లక్ష్మీకాంతరావుకు టికెట్ ఇచ్చింది. మనస్తాపానికి గురైన గంగారాం.. కార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ప్రకటించారు. పెద్దకొడప్గల్ మండలంలోని తన నివాసంలో నియోజకవర్గ కార్యకర్తలతో గంగారాం సమావేశమయ్యారు. స్వతంత్రంగా, కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేస్తానని చెప్పారు. కాంగ్రెస్ తరఫున ఎందుకంటే లక్ష్మీకాంతారావు ఎస్సీ కాదు బీసీ అని పేర్కొన్నారు.