హైదరాబాద్, అక్టోబర్6 (నమస్తే తెలంగాణ): నాంపల్లిలోని అత్యంత పురాతన అనీస్-ఉల్-గుర్బా అనాథ శరణాలయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్తగా రూపుదిద్దుకున్నది. అత్యాధునిక హంగులు, వసతులతో అందుబాటులోకి వచ్చిం ది. దాదాపు రూ.20 కోట్లకు పైగా నిధులతో ‘అనీస్-ఉల్-గుర్బా’ అనాథ శరణాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకోగా, శనివారంప్రారంభించనున్నారు. 1921లో సమాజసేవకులు మీర్ ఖాజా బద్రుద్దీన్ చిస్తీ ఈ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. దీనిని 2009లో వక్ఫ్ బోర్డుకు బదిలీ చేశారు. ఈ పురాతన భవనం శిథిలావస్థకు చేరగా, పునర్నిర్మించేందుకు సీఎం కేసీఆర్ రూ.20 కోట్లు మంజూరు చేశారు. 2017లో పాతభవాన్ని కూల్చి, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో 4,500 చదరపు గజాల స్థలంలో ఏడంతస్థుల్లో కొత్త భవన సమూదాయం నిర్మించారు. ఇందులో 600 మంది పేద, అనాథ బాలలకు సరిపడేలా వసతులు కల్పించారు. ఈ భవనాన్ని శనివారం ప్రారంభించనున్నట్టు వక్ఫ్ బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్ వెల్లడించారు. నార్త్ బ్లాక్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు.