హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ నెల 6న ఉభయ సభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టి, 8న దానిపై చర్చించనున్నారు. శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో 8వ తేదీ వరకు షెడ్యూల్ను ఖరారు చేశారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, విప్ గొంగిడి సునీత, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు పాల్గొన్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ నిర్వహించి సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 7న ఉభయసభలకు సెలవు ప్రకటించారు. ఆ మరుసటి రోజు బడ్జెట్పై చర్చ నిర్వహించి సమాధానం ఇస్తారు. అదేరోజు తదుపరి సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేస్తారు. శాసనమండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే తేదీల్లో మండలి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ నేపథ్యంలో శనివారం ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉభయసభలు సంతాపం తెలుపనున్నాయి.