నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 29 : ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో యాసంగి సాగు ధాన్యం కొనుగోళ్లపై గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో ఈ సంవత్సరం 189 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించగా.. ఇప్పటివరకు 54 చోట్ల ప్రారంభించామన్నారు. మిగిలిన చోట్ల వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రతిరోజూ కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు సందర్శించాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, సి.రాంబాబు, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్వో కిరణ్కుమార్, తహసీల్దార్లు, రైస్మిల్లుల యజమానులు పాల్గొన్నారు.