హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): శాసనసభ, శాసన మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా ముగిశాయని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. మూడు పని దినాల్లో అసెంబ్లీ సమావేశాలు 11 గంటలు, శాసన మండలి సమావేశాలు 11 గంటల 42 నిమిషాలు జరిగాయని తెలిపారు. రెండు తీర్మానాలు, 8 బిల్లులు ఆమోదం పొందాయని వెల్లడించారు. మూడు ముఖ్యమైన అంశాలపై స్వల్పకాల చర్చలు నిర్వహించామని తెలిపారు. ఇందుకు సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేదలు, రైతులపై భారం మోపేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు.
పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు
కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేదర్ పేరు పెట్టాలనే ఏకగ్రీవ తీర్మానం సభ ఆమోదించడం ఆ మహనీయుడి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని చాటుతుందని మంత్రి వేముల వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఇష్టానుసారంగా అమలుచేస్తున్న తీరును, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల అమలులో కేంద్రం వైఫల్యంపై సభలో అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు.
కేంద్రం అవలంబిస్తున్న కక్షపూరిత విధానాలను ఆర్థికమంత్రి హరీశ్రావు విపులంగా వివరించారని చెప్పారు. సభా సంప్రదాయాలను ఎవరు అగౌరవ పరిచినా, సభాపతిని కించపరిచినా ఊరుకోబోమని తెలిపారు. నిబంధనల మేరకే ఓ సభ్యుడిపై స్పీకర్ చర్యలు తీసుకున్నారు తప్ప రాజకీయ దురుద్దేశాలేవీ లేవని ఆయన స్పష్టంచేశారు. ఈ నెల 6న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మంగళవారంతో ముగిసినట్టు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. మొత్తం 3 రోజులపాటు అసెంబ్లీ పనిచేసిందని, 11 గంటలపాటు పలు అంశాలపై చర్చ నడిచిందని పేర్కొన్నారు.