హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ నిర్ణయాలను శనివారం శాసనసభ ముందుంచారు. ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు ఉభయ సభల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఆ రోజు ఉభయసభల్లోనూ ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు. 7న ఉభయ సభలకు సెలవు. 8న బడ్జెట్పై చర్చించనున్నారు. 9 నుంచి 11వ తేదీ వరకు పద్దులపై చర్చిస్తారు. 12న ద్రవ్యవినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతారు. 9 నుంచి 11వ తేదీ వరకు ప్రశ్నోత్తరాలను చేపడ్తారని బీఏసీ నిర్ణయాల్లో పేర్కొన్నారు.
అంశాలపై చర్చ తేదీల వారీగా
ఈ నెల 9న పద్దులపై చర్చ ప్రారంభంకానున్నది. మొదటి రోజు సంక్షేమ శాఖలు – సాంఘిక సంక్షేమం, మైనార్టీ, గిరిజన, మహిళా, శిశు, బీసీ సంక్షేమ శాఖలు, పౌరసరఫరాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఆర్అండ్బీ, ఎైక్సెజ్, అసెంబ్లీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకం, సాంస్కృతిక శాఖలపై చర్చిస్తారు. మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
10న వాణిజ్య పన్నులు, పశుసంవర్ధక, ఫిషరీస్, హోంశాఖ, విద్యాశాఖ, వ్యవసాయం, సహకారం, వైద్య ఆరోగ్య శాఖ, నీటిపారుదల శాఖ తదితర శాఖల పద్దులపై చర్చించి సభ ఆమోదం తెలుపనున్నది.
11న పరిశ్రమలు, ఐటీ, సమాచార పౌరసంబంధాల శాఖ, మున్సిపల్, పట్టణాభివృద్ధి, కార్మిక ఉపాధి కల్పన శాఖ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రవాణా, విద్యుత్తు, దేవాదాయ శాఖల పద్దులపై చర్చిస్తారు.
12న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదిస్తారు.
నలుగురు ప్యానల్ చైర్మన్లు
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నలుగురు ప్యానల్ చైర్మన్లను నియమిస్తూ స్పీకర్ నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ నిర్ణయాన్ని శనివారం సభ ప్రారంభంకాగానే ప్యానెల్ చైర్మన్ల పేర్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ప్యానల్ చైర్మన్లుగా రెడ్యానాయక్, మోజంఖాన్, హన్మంతు షిండే, మంచిరెడ్డి కిషన్రెడ్డి వ్యవహరిస్తారని తెలిపారు. వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన నివేదికలను సైతం సభ ముందు ఉంచారు.
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీఎస్టీపీసీ) 2014-15 నుంచి మూడేండ్లకు సంబంధించిన నివేదికను పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సభ ముందు ఉంచారు.
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ 2018-19 వార్షిక నివేదికను అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు.
తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ (మిషన్ భగీరథ) 4 వార్షిక నివేదికలను సభ ముందుంచారు.
తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ నాలుగు వార్షిక నివేదికలను మంత్రి గంగుల కమలాకర్ సభ ముందు పెట్టారు.
తెలంగాణ వక్ఫ్ నిబంధనల నోటిఫికేషన్ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రవేశపెట్టారు.
ఈ మంత్రులకు అదనపు బాధ్యతలు
బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలువురు మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. శాసనసభ, శాసనమండలిలో ఆయా శాఖలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, చర్చలో పాల్గొని సభ్యులకు సమాధానం ఇస్తారు. ఎవరికీ కేటాయించని శాఖలతోపాటు సీఎం వద్ద ఉన్న శాఖలను మంత్రులకు అదనపు బాధ్యతగా అప్పగించారు. దీనిలో భాగంగా మంత్రి కేటీఆర్కు అదనంగా గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌరసంబంధాలశాఖ, మంత్రి హరీశ్రావుకు అదనంగా జీఏడీ, నీటిపారుదలశాఖ, శాంతి భద్రతలు, ప్రణాళికశాఖ, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి రెవెన్యూ శాఖ, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు అప్పగించారు.