నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : సినీ నటి వేంకట అశ్విన్రెడ్డి కొయ్య అలియాస్ ఆశురెడ్డిపై సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. సీసీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసిన ఆమె తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశాలు జారీ చేయడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు తర్వాత ఇరువైపులా వాదనలు కొనసాగనున్నాయి.
బాధితుడి తండ్రి ఎనుమల సత్యనారాయణమూర్తి సీసీఎస్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు ఆమెపై కేసు నమోదు చేసి నాంపల్లిలోని 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఎఫ్ఐఆర్ సమర్పించారు. పోలీసు విచారణకు సహకరించకుండా పరారీలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అచూకీ కోసం అధికారులు గాలిస్తున్న తరుణంలో ముందస్తు బెయిల్ కోసం ఆమె కోర్టును ఆశ్రయించారు. కేసులో పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తారనే అనుమానంతో నాంపల్లిలోని జిల్లా కోర్టును ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
నటి ఆశురెడ్డిపై సెక్షన్లు 318 (4) రెడ్విత్ 3(5) కింద కేసు నమోదు కాగా నాన్బెయిలబుల్ సెక్షన్ల క్రింద ఆమెను అరెస్టు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితురాలిగా ఆశురెడ్డిని, వేంకటక్రిష్ణ కొయ్య, వేంకట దివ్యారెడ్డి కొయ్య, కొయ్య యశోదరెడ్డిలను నిందితులుగా చేర్చి ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. తన కుమారుడు వైవీ.ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడని, 2018లో ఆశురెడ్డితో తన కుమారుడితో ఏర్పడిన స్నేహాం ప్రేమగా మారిన తర్వాత ప్రేమ పేరిట ఆమె కోట్ల రూపాయలను తీసుకుని చెల్లిస్తానని మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
యూఎస్ఏలో మాస్టర్స్ పూర్తి చేశానని, పెళ్లికి నిరాకరించడంతో సదరు డబ్బును వాపస్ ఇవ్వాలని కోరడంతో తన కుమారుడిని భయాందోళనకు గురిచేసినట్టు తెలిపారు. తన కుమారుడిని పెళ్లిచేసుకుంటానని నమ్మించి కార్లు, బంగారం, స్థిరాస్తులను కొనుగోలు చేసి ఆమెపేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. 2020లో పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని కోరడంతో ఆమె నిరాకరించిందన్నారు. పెళ్లి చేసుకునేందుకు ఆమె నిరాకరించడంతో ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని తెలిపినట్టు వివరించారు.
టాలీవుడ్ నటి హేమ సమక్షంలో జరిగిన సంభాషణలో రూ.70లక్షల రూపాయలను, భరోసా కోసం బ్లాంక్ చెక్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆశురెడ్డి మానసిక వ్యాధితో బాధ పడుతున్నదని ఆమె సోదరి దివ్యారెడ్డి తనకు ఫోన్ ద్వారా తెలియజేసిందన్నారు. గతం గురించి మరచిపోయి పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నదని నమ్మబలికి, 2025లో దివ్వారెడ్డికి సైతం రూ.50లక్షలు తన కుమారుడు ఇచ్చినట్టు తెలిపారు. అనంతరం ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ఆమె నిరాకరించిందన్నారు. 5కేజీల బంగారం సుమారు 9.35కోట్ల డబ్బును తన కొడుకు ఆన్లైన్ ద్వారా ఆమెకు అందించాడని, సదరు డబ్బును తిరిగి చెల్లించాలని కోరడంతో పోలీసులను ఆశ్రయించి తనతోపాటు కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు.