నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 17 : కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. రెండ్రోజులుగా ఆయా కలెక్టరేట్ల ఎదుట వంటావార్పుతో నిరసనలు చేపట్టారు. మంగళవారం నాగర్కర్నూల్లో చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. వెయ్యి మంది ఆశా వర్కర్లు నిరసనలో పాల్గొనగా.. పోలీసులు ఈడ్చుకెళ్లి పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో కొద్దిసేపు తోపులాట చోటుచేసుక్నుది. జోగుళాంబ గద్వాల జిల్లాలో వంటావార్పు చేసి ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం ఖరారు చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లు మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ను ముట్టడించడానికి యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. సీఐటీయూ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కార్యదర్శి తుమ్మ విష్ణువర్ధన్, భద్రాద్రి జిల్లా జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ 20 ఏండ్ల నుంచి ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తున్నా, కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.