కొల్లాపూర్, మే 28 : ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు క్యాంపు కార్యాలయాన్ని ఆశా కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు రూ.9వేలు మాత్రమే ఇచ్చి గొడ్డు చాకిరి చేయిస్తున్నదని, దీంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆశా కార్యకర్తలకు ఇవ్వాల్సిన రూ.1500 పారితోషికాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును తమ సమస్యలపై నిలదీసి వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన మంత్రి.. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.