ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన వెంటనే బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ బాహాటంగా బెదిరింపులకు దిగారు. ఇదే హైకోర్టు నుంచి రక్షణ పొందిన సంతోష్ సింగిల్ జడ్జి తీర్పు రాగానే అధికారులతోపాటు సాక్షులను కూడా బెదిరిస్తూ మాట్లాడారు. బహిరంగసభ వేదికపై నుంచి బెదిరించడం కోర్టు ధికరణగా పరిగణించవచ్చు.
ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తును హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేయడాన్ని బీజేపీ తొలుత స్వాగతించింది. అప్పుడు స్వాగతించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నది. బీజేపీ లేదా నిందితులు తప్పు చేయనప్పుడు సిట్ దర్యాప్తును అడుగడుగునా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు.
సిట్లో ఉన్న ఐపీఎస్ అధికారులంతా సీనియర్లు. గతంలో అత్యంత క్లిష్టమైన కేసులను ఛేదించిన అనుభవం వారికి ఉన్నది. అలాంటి ఐపీఎస్ అధికారుల దర్యాప్తు తీరును బీజేపీ/నిందితులు ఏ దశలోనూ శంకించలేదు. వాళ్లపై ఆరోపణలు చేయలేదు. దర్యాప్తు అధికారిపై ఆరోపణలు లేనప్పుడు సిట్ను రద్దు చేయడం చట్ట వ్యతిరేకం. – ప్రభుత్వ వాదనలు
హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): దేశం నియంతృత్వ పాలనలోకి వెళ్లబోతున్నదని, రాజ్యాంగ ధర్మాసనాలైన ఉన్నత న్యాయస్థానాలు న్యాయాన్ని పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. రాజ్యాంగ వ్యవస్థలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ ఆగడాలకు కళ్లెం వేయాలని కోరింది. ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం వాదనలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన వెంటనే బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ బాహాటంగా బెదిరింపులకు దిగారని హైకోర్టుకు నివేదించారు. అధికారులతోపాటు సాక్షులను కూడా బెదిరిస్తూ మాట్లాడారని తెలిపారు. బహిరంగసభ వేదిక పైనుంచి బెదిరించడం కోర్టు ధికరణగా పరిగణించవచ్చునని పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులు తాము బీజేపీ ప్రతినిధులుగా వచ్చామని కూడా చెప్పారని, వీడియో సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐ దర్యాప్తునకు సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని అన్నారు. అనేక ఆధారాలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోకుండా తీర్పు చెప్పి ఏ విధంగా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. తక్షణమే తీర్పును రద్దు చేయాలని కోరారు.
సీఎం మీడియా సమావేశంలో చెప్పినంత మాత్రాన దానిని ఆధారంగా చేసుకొని సింగిల్ జడ్జి సిట్ను రద్దు చేసి సీబీఐకి బదిలీ చేయడాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలని దవే కోరారు. సీఎం చెప్పినంత మాత్రాన అది పోలీస్ దర్యాప్తును ప్రభావితం చేస్తుందనడం హాస్యాస్పదం అవుతుందని అన్నారు. కేసు దర్యాప్తును హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తును బీజేపీ తొలుత స్వాగతించిందని గుర్తుచేశారు. అప్పుడు స్వాగతించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నదని ప్రశ్నించారు. హైకోర్టుకు సమర్పించిన వీడియోల్లో ఎమ్మెల్యేలు, నిందితులు మాట్లాడుకున్నవి కూడా ఉన్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామని చెప్తున్నట్టుగా ఉన్న వీడియోలను సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. సిట్లో ఉన్న ఐపీఎస్ అధికారులంతా సీనియర్లని, అత్యంత క్లిష్టమైన కేసులను ఛేదించిన అనుభవం వారికి ఉన్నదని చెప్పారు. అలాంటి ఐపీఎస్ అధికారుల దర్యాప్తు తీరును బీజేపీ/నిందితులు ఏ దశలోనూ శంకించలేదని, వాళ్లపై ఆరోపణలు చేయలేదని, దర్యాప్తు అధికారిపై ఆరోపణలు లేనప్పుడు సిట్ను రద్దు చేయడం చట్ట వ్యతిరేకమని వాదించారు.
నిందితులు ఏ పార్టీకి చెందిన వారు కాదని, అయినా బీజేపీలోకి ఎమ్మెల్యేలు చేరేందుకు కొనుగోలు రాయబేరాలు నిర్వహించారని దవే చెప్పారు. తమంట తాము బీజేపీ తరఫున వచ్చామని నిందితులు చెప్పారని, బీజేపీలో ఎమ్మెల్యేలు చేరితే కోట్ల రూపాయలు ఇస్తామని, కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని చెప్పడమే కాకుండా చేరకపోతే ఐటీ, ఈడీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని కూడా తెలిపారు. ఇదంతా వీడియో, ఆడియోలో రికార్డు అయ్యిందని దీన్ని సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకొని ఉంటే సిట్ దర్యాప్తును రద్దు చేసుండేవారు కాదని అన్నారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసిందని చెప్పారు. ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని తెలిపారు. తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రను పోలీసులు భగ్నం చేశారని చెప్పారు. బీజేపీ దేశవ్యాప్తంగా చేయాలనుకున్న కుయుక్తులను బట్టబయలు చేయాలనే ప్రయత్నంలో భాగంగానే సీఎం మీడియా సమావేశం నిర్వహించారని తెలిపారు. లేకపోతే మరింత మంది ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ ఎత్తులు, పైఎత్తులు వేస్తూనే ఉంటుందని చెప్పారు.
ఈ కేసుతో సంబంధం లేదంటున్న బీజేపీ నిందితులకు బాహాటంగా మద్దతు ఇస్తూ వారికి అండగా హైకోర్టులో తొలుత రిట్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. బీజేపీ పాత్ర ఏమీ లేకపోతే, మొయినాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 12 గంటల్లోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి సీబీఐ దర్యాప్తు కావాలని కోరడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. సింగిల్ జడ్జి కొన్ని తీర్పులను పరిగణనలోకి తీసుకొని సీబీఐకి బదిలీ చేశారని, మరికొన్నింటిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం లేదన్నారు. సీబీఐ దర్యాప్తునకు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరారు. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తీర్పు అమలును రెండు వారాలపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. ఇరుపక్షాలు లిఖితపూర్వక వాదనలను 30లోగా సమర్పించవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పును వాయిదా వేసింది.