హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారమే కృష్ణ, గోదావరి నదుల యాజమాన్య బోర్డులకు అధికారాలను కల్పించి, పరిధిని ఖరారు చేశామని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ రెండు బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గెజిట్ నోటిఫికేషన్లు విడుదలచేసే ముందు ఎంతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అందరి వాదనలు విన్న తర్వాతే బోర్డుల పరిధిపై నిర్ణయం తీసుకున్నామని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి చెప్పారు. ఢిల్లీలోని శ్రమ్శక్తి భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నదీ జలాల పంపిణీకి సంబంధించి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి తమ పరిశీలనలో ఉన్నదని చెప్పారు. ఆ విషయమై న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్యాల బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్శక్తిశాఖ గురువారం అర్ధరాత్రి తర్వాత వేర్వేరుగా రెండు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం తెలంగాణ, ఏపీలోని నీటిపారుదల ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా రెండు రాష్ర్టాల్లోని ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులే చూసుకోనున్నాయి. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ర్టాలు భరించాల్సి ఉంటుంది. బోర్డులకు మరిన్ని అధికారాలు కల్పించడమే కాకుండా.. ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు కూడా కేంద్రం అప్పగించింది. కృష్ణ, గోదావరి నదులపై నిర్మించిన బరాజ్లు, డ్యామ్లు, రిజర్వాయర్లు, నియంత్రణ వ్యవస్థలు, కాల్వల నెట్వర్క్, సరఫరా వంటివన్నీ బోర్డుల పరిధిలోకి వెళ్తాయని కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్లు పేర్కొన్నాయి.
అవసరాల మేరకు నీటి విడుదల
షెడ్యూల్-2 పూర్తిగా బోర్డుల పరిధిలోనే ఉంటుందని అవస్థి చెప్పారు. షెడ్యూల్-3లో ఉన్న ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయని వివరించారు. బోర్డుల ఆదేశాల మేరకు రాష్ర్టాలు నడుచుకోవాలని సూచించారు. ఇరు రాష్ర్టాల అవసరాలు, ప్రతిపాదనల మేరకు నీటి విడుదల ఉంటుందని తెలిపారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ల ప్రకారం బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ర్టాలు సమానంగా భరించాల్సి ఉంటుందని అవస్థి చెప్పారు. నోటిఫికేషన్ జారీ అయిన 60 రోజుల్లోగా రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని తెలిపారు. బోర్డుల నిర్వహణకు, నిధులు, వనరుల కొరత రాకూడదన్నారు. నీటి వాటా పంపిణీ చాలా సున్నితమైన అంశమని, ప్రతి చిన్న విషయాన్ని అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. నీళ్ల పంపిణీ విషయంలో ఇరు రాష్ర్టాల మధ్య సయోధ్య, ఏకాభిప్రాయం సాధించడం అతిపెద్ద సవాల్ అని అవస్థి చెప్పారు. ట్రిబ్యునళ్ల పంపిణీ ప్రకారమే నీటి కేటాయింపులుంటాయని స్పష్టంచేశారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని ఈ సందర్భంగా విలేకరులు ప్రస్తావించగా ఆయన దానికి స్పష్టతనిచ్చారు. సుప్రీంకోర్టు నుంచి పిటిషన్ను ఉపసంహరించుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తమకు సమాచారం ఇచ్చిందని, ఆ తర్వాతనే బోర్డు పరిధిని నోటిఫై చేశామని వివరించారు. అదేవిధంగా కొత్త ట్రిబ్యునల్ను రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నీటి కేటాయింపుల కోసమా? లేక పూర్తిగా బేసిన్లోని 4 రాష్ర్టాలకు కొత్తగా కేటాయింపులు జరపాలా అనే అంశంపై జల్శక్తిశాఖ న్యాయశాఖ అభిప్రాయం కోరిందని వెల్లడించారు. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చిన్నవిషయం కాదని తెలిపారు.
2014 నుంచే కసరత్తు
తెలంగాణ, ఏపీ మధ్య నదీజలాల పంపిణీ కోసం గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు (కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ) నెలకొల్పాలని ఏపీ పునర్విభజన చట్టం సూచిస్తున్నదని సంజయ్ అవస్థి చెప్పారు. సదరు చట్టంలోని సెక్షన్ 84 ప్రకారం ఇప్పటికే కృష్ణా, గోదావరి రివర్ బోర్డులను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆ సెక్షన్ ప్రకారమే ఈ రెండు బోర్డులను పర్యవేక్షించేందుకు అపెక్స్ కౌన్సిల్ కూడా ఏర్పాటైందన్నారు. ఆ కౌన్సిల్లో కేంద్ర జల్శక్తి శాఖ, ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. అదేవిధంగా బోర్డుల పరిధిని నిర్దేశించాల్సి ఉన్నదని, 2014 నుంచి అందుకు కసరత్తు చేస్తున్నామని వివరించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ భాగస్వామ్యం, సహకారంతో గెజిట్ తయారు చేశామని, కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. గెజిట్లో కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టులతోపాటు ఆమోదించనివి కూడా ఉన్నాయని, వాటిపై సమగ్ర వివరణ ఇచ్చామని చెప్పారు. గెజిట్లో ప్రస్తావించినంత మాత్రాన.. ఇంతవరకు ఆమోదం పొందని ప్రాజెక్టులకు ఆమోదం లభించినట్టుగా భావించవద్దని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల భద్రతను కూడా కేంద్ర బలగాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు.
రాష్ర్టాల కోరిక మేరకే..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 85 ప్రకారం లభించిన అధికారాల మేరకు కేంద్ర ప్రభుత్వం 2014, జూన్ 2న రెండు నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటుచేసిందని కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలిపింది. ఆ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఏర్పాటయ్యాయని పేర్కొన్నది. అయితే ఈ బోర్డుల పరిధి, అధికారాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేసే విషయమై ఉభయ రాష్ర్టాల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, ఈ సమస్యను గత ఏడాది అక్టోబర్లో కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో పరిష్కరించారని, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ పరిధిని కేంద్రం నోటిఫై చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఆ మేరకు కేంద్రం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల పరిధి, అధికారాలకు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారుచేస్తూ నోటిఫికేషన్లు జారీచేసిందని అవస్థి చెప్పారు.