డిచ్పల్లి/ఖలీల్వాడి, అక్టోబర్ 01: రాష్ట్రంలో మారుమూల తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి.. వాటిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాంగ్రా శివారులో రూ.3 కోట్ల తో నిర్మించనున్న బంజారా భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి ఆదివారం ఆమె భూమిపూజ చేశారు. అనంతరం సమీపంలోని ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. 2014 నుంచి కేసీఆర్ పాలనలో గిరిజనలకు స్వర్ణయుగం వచ్చిందని తెలిపారు. గిరిజనుల హక్కులు, వారి అభివృద్ధికి కోసం మనసుపెట్టి పని చేసే ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆర్ ఒక్కరేనని స్పష్టం చేశారు. ఈ మాటను తాను మంత్రిగా చెప్పడం లేదని, ఒక గిరిజన బిడ్డగా చెప్తున్నానని తెలిపారు. 3,196 తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్దేనని కొనియాడారు.
గిరిజనుల గురించి వీరి కంటే ఎక్కువగా ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ను పదికాలాల పాటు కాపాడుకునే బాధ్యత ఈ జాతిపై ఉం దని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు గిరిజనులంటే ఎంతో ఇష్టమని చెప్పా రు. కల్యాణలక్ష్మి పథకం గిరిజనుల నుంచే వచ్చిందని, ఉద్యమ సమయంలో కేసీఆర్ వరంగల్లో పర్యటిస్తున్నప్పుడు.. ఓ తండాలో రేపు పెండ్లి ఉందనగా గిరిజనుడి ఇల్లు కాలిపోగా.. బాధితుడు చెప్పిన మాటలు విని కల్యాణలక్ష్మి పథకానికి రూపకల్పన చేశారని వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా బంజారాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాకే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పారు. రైతు బీమా, రైతుబంధు, పోడుపట్టాలు అందించిన ఘనత తెలంగాణదేనని స్పష్టం చేశారు.
60 ఏండ్లు పాలించిన వారు ఏమీ చేయలేదని, కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రాధా న్యం ఇస్తున్నారని పునరుద్ఘాటించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం బిగాల కృష్ణమూర్తి భవనాన్ని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి మంత్రి సత్యవతి ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘానికి 1.5 కోట్లు మంజూరు చేశామని, ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే బిగాలను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.