హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ‘బేషరతుగా సమ్మెను విరమించి.. ఆర్టిజన్లు విధుల్లో చేరుతున్నారు.. వారి విజ్ఞప్తిని మానవతా దృక్పథంతో పరిశీలించండి.. తొలగించిన 200 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుకు సూచించారు. దీంతో విద్యుత్తు సంస్థల్లో ఆర్టిజన్ల సమ్మె సుఖాంతమైంది. ఆర్టిజన్లు తమ సమ్మెను బేషరతుగా విరమించారు. ఈ మేరకు బుధవారం విద్యుత్తు సౌధలో యాజమాన్యాల తరఫున ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, జేఎండీ శ్రీనివాసరావు తదితరులతో, ఎంఐఎం ఎమ్మెల్యే బలాల సారథ్యంలోని కార్మిక సంఘాల ప్రతినిధులు చర్చించారు. ఉద్యోగాల్లోంచి తొలగించిన 200 మంది ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎండీకి విన్నవించారు. కార్మిక శాఖ కమిషనర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.
విద్యుత్తు సంస్థల యాజమాన్యాలతో కార్మిక సంఘాల ప్రతినిధుల చర్చలు జరుగుతున్న సమయంలోనే సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్టిజన్ల సమ్మె ప్రభావం, విద్యుత్తు సరఫరాలపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆర్టిజన్లు బేషరతుగా సమ్మెను విరమించారని, ఉద్యోగాల్లోంచి తొలగించిన 200 మంది ఆర్టిజన్లను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని విన్నవించినట్టు సీఎండీ తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారని సీఎండీ తెలిపారు.