హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో సాధించిన ప్రగతిని కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘అర్థ్ నీతి’ నివేదికలో ప్రతిబింబింప చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై ప్రశంసల జల్లు కురిపించిందని ఆయన తెలిపారు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ళ కాలంలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిందని నీతి ఆయోగ్ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని వినోద్ కుమార్ సూచించారు. కళ్ళుండి కబోదిగా వ్యవహరించవద్దని, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా దూసుకెళ్తోందని, అందుకు నీతి ఆయోగ్ అర్థ్ నీతి నివేదికే తార్కాణమని ఆయన చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు రాజకీయంగా విమర్శలు చేయడం మానుకొని, వాస్తవాలను గ్రహించి మెలగాలని వినోద్ కుమార్ హితవు చెప్పారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆ ప్రగతి ఫలితమే నీతి ఆయోగ్ నివేదికలో ప్రస్ఫుటమైందని ఆయన వివరించారు. రాష్ట్ర జీఎస్డీపీ 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,05,849 కోట్లు ఉండగా, 2020-21లో రూ. 9,80,407 కోట్లకు చేరుకుందని, ఇది 94% శాతం పెరిగిందని వినోద్ కుమార్ తెలిపారు.
రాష్ట్ర వార్షిక వృద్ధి 2015-16 నుంచి ఇప్పటి వరకు 11.7% శాతం కంటే ఎన్నడూ తగ్గలేదని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో 54% శాతం మంది పాలుపంచుకుంటున్నారని, రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా 2% శాతం ఉన్న వ్యవసాయం ప్రస్తుతం 16.5% శాతానికి పెరిగిందని వినోద్ కుమార్ వివరించారు. సీఎం కేసీఆర్ విజన్ తో కాళేశ్వరం, మిడ్ మానేరు వంటి పలు ప్రాజెక్టుల వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. నీటి పారుదల రంగంలో గణనీయమైన ప్రగతితో వ్యవసాయం పెరిగిందని వినోద్ కుమార్ తెలిపారు. పర్ క్యాపిటా ( తలసరి ) ఆదాయం దాదాపు రెండింతలు అయింద ఆయన అన్నారు. 2014-15 లో పర్ క్యాపిటా ఆదాయం రూ. 1,24,104 లక్షలు ఉండగా 2020-21 లో అది రూ. 2,37,632 లక్షలకు పెరిగిందని తెలిపారు. ఇలా అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుని ముందుకు సాగుతోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.