హైదరాబాద్ సిటీబ్యూరో, చిక్కడపల్లి, మార్చి 2 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ రాకతో తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల నిర్బంధకాండ కొనసాగింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లలో నిర్బంధించారు. తెలుగు రాష్ర్టాల కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల సమావేశానికి హాజరయ్యేందుకు రాహుల్గాంధీ సోమవారం వికారాబాద్కు వచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి నిరుద్యోగులను దగా చేసిన రాహుల్గాంధీని నిరుద్యోగులు నిలదీస్తారనే అరెస్టులు చేశారని యువత మండిపడుతున్నది.
సోమవారం ఉదయం కూడా పలువురిని ఎక్కడికక్కడ బైండోవర్లు చేసి నిర్దాక్షిణ్యంగా పోలీస్స్టేషన్లకు తరలించారు. దొరికిన వారిని దొరికినట్టు అదుపులోకి తీసుకొన్నారు. అర్ధరాత్రి నిరుద్యోగ జేఏసీ నేతల నివాసాల్లోకి వెళ్లిన పోలీసులు.. వారిని అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు అశోక్నగర్లో ఉండే నిరుద్యోగ జేఏసీ నాయకులను అరెస్టు చేశారు. అశోక్నగర్లో కొడంగల్ రవికుమార్, జేఏసీ నేతలు శంకర్నాయక్, రవి రాథోడ్, రవికుమార్, లక్ష్మీకాంత్, తారాచంద్, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్స్టేపన్కు తరలించారు.
చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులు కయ్య వెంకటేశ్, సురేశ్నాయక్, లక్ష్మణ్, కుమార్ తదితరులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం చిక్కడపల్లి సెంట్రల్ లైబర్రీ, అశోక్నగర్ ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొన్నారు. ఎమర్జెన్సీ తరహాలో విద్యార్థులు, నిరుద్యోగులను బయట తిరగనీయకుండా దౌర్జన్యానికి పాల్పడినారని విద్యార్థి, నిరుద్యోగ నేతలు మండిపడ్డారు. విద్యార్థులు, నిరుద్యోగుల అక్రమ అరెస్టులను జేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు.